- ప్రభుత్వ తీరు జీవించే హక్కును హరించేలా ఉందని వ్యాఖ్య
- గతంలో ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడంపైనా అసహనం
- 17వ తేదీ నాటికి వివరాలు అందించాలని ఆదేశం
కొరోనా నిర్దారణ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు చేయకుండా పౌరుల జీవించే హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బుధవారం మండిపడింది. కొరోనా వ్యాప్తి కట్టడి, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల అందజేత తదితర అంశాల్లో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని సర్కారును ప్రశ్నించింది. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని కరోనా టెస్టులు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్టస్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? జూన్ 26న టెస్టులు ఎందుకు అపేయాల్సి వచ్చింది? భారత వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు నిర్వహించారో తెలపాలని ప్రభుత్వాన్ని అదేశించింది. అదే విధంగా రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర బృందం.. ఎక్కడెక్కడ పర్యటించిందన్న అంశానికి సంబంధించి ఈనెల 17న పూర్తి వివరాలు అందజేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక డాక్టర్లు, పారమెడికల్ సిబ్బందికి ఏప్రిల్ 21, జూన్ 8 , జూన్ 18 రోజున ఎన్నెన్ని పీపీఈ కిట్లు ఇచ్చారో తెలపాలని ఆదేశించింది.
తదుపరి విచారణలో భాగంగా జూలై 17న న్యాయస్థానం ప్రభుత్వ వివరాలపై సంతృప్తి చెందక పోతే.. జూలై 20న చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. నివేదికలు సమర్పించకపోతే.. కోర్టు ధిక్కరణగా భావిస్తామని హెచ్చరించింది. కరోనా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై దాఖలైన పిటిషన్ను బుధవారం విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్.ఏ.డీ. బ్లడ్ శాంపీల్స్ ఎందుకు చేయకూడదని, 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చే పరీక్షలు చేయాలని ఆదేశించామని తెలిపింది. 50 వేల టెస్టులు చేస్తామని చెప్పి.. మూడు రోజులు అసలే టెస్టులు చేయలేదని కోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాది తీసుకెళ్లారు. ఇప్పటికైనా ఆర్.ఏ.డీ. శాంపిల్స్ సేకరించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. జీవించే హక్కును హరించే లా ప్రభుత్వం వ్యవహారింస్తుందని ఘాటు వ్యాఖ్యాలు చేసింది. హక్కులను కాలరాస్తుందని గుర్తిస్తున్నామని, అవిధంగా ప్రభుత్వం చేయరాదని గుర్తుంచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.