- టీఆర్ఎస్ పార్టీతో కలిపి చెత్తబుట్టలో వేయాలి..
- 100 రోజుల ప్రణాళిక, ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ భవనాలు ఎక్కడ?
- కొరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చలేదు..
- టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజాతంత్ర, హైదరాబాద్ : టీఆరెస్ మేనిఫెస్టోపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శల జల్లు కురిపించారు. టీఆరెస్ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితమని విమర్శించారు. మంగళవారం ఇందిరభవన్లో మీడియాతో మాట్లాడుతూ….తమ మేనిఫెస్టో ఒక భాగవత్గీత, బైబుల్, ఖురాన్ అని చెప్పిన కేసీఆర్ ఎన్ని అబద్దాలు చెప్తారని మండిపడ్డారు. టీఆరెస్ పార్టీని మేనిఫెస్టోతో పాటు చెత్త బుట్టలో వేయాలన్నారు. ట్యాంక్ బండ్లో నీళ్లు కొబ్బరి నీళ్లుగా చేస్తానని, హైదరాబాద్లో ఫ్రీ వైఫై అని చెప్పిండ్రు, స్కై, ఫ్లై ఓవర్లు అన్నరు..ఇప్పుడు ఈ అంశాలు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కి సిగ్గుండాలని, హైదరాబాద్లో లక్ష డబల్ బెడ్ రూమ్లు అన్నరు కానీ ఒక్కటైన ఇచ్చారా…? ఇంత అబద్దాలు మాట్లాడడం సరికాదని ధ్వజమెత్తారు.
ఏడేళ్లు అధికారంలో ఉన్నారు..ఇప్పుడు కొనసాగుతున్నారు..మళ్లీ డ్రైనేజీ సిస్టం సరిగా లేదని మాట్లాడుతున్నారంటే టీఆరెస్ ఏమి చేయలేదనే కదా..! మూసిని 2014 నుండి శుద్ధి చేస్తానని చెప్తూనే వొస్తున్నారు…ఇప్పుడు మేనిఫెస్టోలో మళ్లీ అదే అబద్ధం చెప్తున్నారని విరుచుకుపడ్డారు. కొరోనా సమయంలో ఒక హాస్పిటల్ కూడా విసిట్ చేయలేదు, ప్రగతి భవన్, ఫార్మ్ హౌస్ నుండి బయటికి రాలేదు..ఇప్పుడు బస్తి ధవాఖానాల గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కొరోనా మొదలైన రోజు నుండి ప్రజల కష్టాల గురించి మాట్లాడలేదు కానీ ఎన్నికలకు ఒక వారం ముందు మోటార్ వెహికిల్ టాక్స్ రద్దు, సెలూన్, దోబీ ఘాట్ వాళ్ళకి ఉచిత కరెంట్ అని, 20 వేల లీటర్ల నీటి వినియోగం చేస్తే బిల్లు కట్టాల్సిన అవసరం లేదని మాట్లాడుతూ ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు.