- రేషన్బియ్యంలో కేంద్రానివి 29 రూపాయలు..రాష్ట్రానిది ఒక రూపాయే
- మాయమాటలు చెప్పడంలో కేసిఆర్ దిట్ట
- ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ ఎంపి, రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్
- కెసిఆర్ ఎవరినీ ఎక్కువ కాలం సహించడు..తదుపరి బలయ్యేది హరీష్ రావేనని వ్యాఖ్య
టిఆర్ఎస్ నేతలు వోటుకు 20వేలు ఇస్తారట అని, మాయమాటలు చెప్పడంలో కెసీఆర్ మహాదిట్ట అని రాష్ట్ర బిజేపి అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. బుధవారం జయ్యికుంట మండలంలోని మడిపల్లి, అంకుశాపూర్, మాచనపల్లి ,సైదాబాద్, విలాసాగర్, గండ్రపల్లి, శాయంపేట గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైదాబాద్ గ్రామానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఉపాధి హామీ పథకం కింద 33 లక్షల రూపాయలు, విద్యుత్దీపాలు, రోడ్ల కోసం 39 లక్షలు, ఆర్థిక సంఘం నిధుల కింద 68 లక్షలు, మరుగుదొడ్ల కోసం 13 లక్షలు, స్మశానవాటికల కోసం 11 లక్షల 13 వేల ఏడువందల రూపాయలు, రైతువేదిక కోసం 10లక్షలు, డంప్యార్డు కోసం కూడా డబ్బులు ఇచ్చింది కేంద్రమే అని అన్నారు. రేషన్ బియ్యంలో కేంద్రం ఒక కిలోకు 29 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము ఒక రూపాయి మాత్రమే ఇచ్చిందని, అయినా రేషన్ షాపుల ముందు ప్రధాని నరేంద్రమోడి ఫోటో బదులు, కెసీఆర్ ఫోటో పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో తన పేరు మీద ఫోర్జరీ లేఖ సృష్టించి ప్రజలకు అందాల్సిన వరద సాయం అడ్డుకున్నాడని, కెసీఆర్ అహంకారాన్ని అణచాలంటే పేదలకు న్యాయం జరుగాలంటే, దళితులకు పది లక్షల రూపాయలు రావాలంటే పువ్వు గుర్తుకు వోటు వేసి గెలిపించాలన్నారు. ఈ ఎన్నికల తరువాత కెసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేయకుండా ఎవరితోనైనా కోర్టులో పిటిషన్ వేయించి డబ్బులు రాకుండా చేస్తాడని అన్నారు. బిజేపిపి గెలిపిస్తే ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టి దళిత బంధు డబ్బులు అందేలా కొట్లాడుతామని, బిజేపి అభ్యర్థి ఈటల రాజేందర్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్, మార్తినేనిధర్మారావు, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మండల, ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
కెసిఆర్ ఎవరినీ ఎక్కువ కాలం సహించడు..టిఆర్ఎస్లో తదుపరి బలయ్యేది హరీష్ రావే
టీఆర్ఎస్లో ఎవరినీ కెసిఆర్ ఎక్కువ కాలం కొనసాగించరని, తదుపరి బలయ్యేది మేనల్లుడు, మంత్రి హరీష్ రావేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. కెసిఆర్ ఎవరిని కూడా ఎక్కువ కాలం సహించరని అన్నారు. అందుకు ఈటలదే ఉదాహరణ అన్నారు. ఉద్యమ కాలం నుంచి ఉన్న ఈటలను తప్పించిన కెసిఆర్..ఎవరినైనా తప్పించగలరన్నారు. ఆయనకు కొడుకు, కూతురు ఉంటే చాలన్నారు. హుజూరాబాద్ పర్యటనలో భాగంగా బండి సంజయ్ మిడియాతో మాట్లాడుతూ..హరీష్ రావుకు కేసీఆర్ టార్గెట్ పెట్టారు. నువ్వు మంచోడివే..కానీ అబద్ధాలు మాట్లాడకు.. కేసీఆర్ కుటుంబంలో నాలుగైదు కమిటీలు ఉన్నాయి. ఒకటి లంచం ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసే కమిటీ.. మరొకటి మిడియా ముందు అబద్ధాలు మాట్లాడే కమిటీ. కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏనాడైనా లాఠీ దెబ్బలు తిన్నారా?అని ప్రశ్నించారు. ఉద్యమంలో వీరి పాత్ర ఏంటన్నారు. వేల కోట్లతో హుజురాబాద్లో గెలవాలని అనుకుంటున్నారని, కానీ అది సాధ్యం కాదని గుర్తించాలని పేర్కొన్నారు. హుజూరాబాద్లో బిజెపి గెలుపుతో టిఆర్ఎస్ పతనం ఖాయమన్నారు.
ఇదిలావుంటే కేసీఆర్ బొమ్మ చూపించి గెలవాలని టీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారని, ఆ బొమ్మకు వోట్లు పడే రోజులు పోయాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..పచ్చటి సంసారాల్లో కేసీఆర్ నిప్పు పెట్టారని, మానవ సంబంధాలకు మచ్చ తీసుకువస్తున్నారన్నారు. పంట చేతికొచ్చినా కొనే దిక్కు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈటల డిమాండ్ చేశారు. ప్రచారం చేసుకోకుండా అధికార పార్టీ అడుగడుగునా అడ్డుపడుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పింఛన్లు ఇవ్వలేని దద్దమ్మ మంత్రులుగా ఉన్నామని, ఇప్పుడు బయటికి వొచ్చి గట్టిగా మాట్లాడి బానిసత్వం నుంచి బయటపడ్డందుకు గర్వంగా ఉందన్నారు. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే బ్రోకర్లు నా మిద నేనే దాడి చేసుకుంటానని చెబుతున్నారని, వాళ్ల భరతం పడుతానన్నారు.
కాళేశ్వరం అవినీతి సొమ్ము తీసుకొని ఈటలకు వోటు వేయండని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నిధులన్నీ సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్కే తరలిస్తున్నారన్నారు. హుజూరాబాద్లో ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోటర్లకు మిటర్లు పెడుతారని, పింఛన్లు రావని భయపెట్టారని, గెలిచి పది నెలలైనా మిటర్లు పెట్టలేదన్నారు. అబద్ధాల పునాదుల మిదనే టీఆర్ఎస్ పార్టీ బతుకుతుందన్నారు. కేసీఆర్ ధృతరాష్ట్ర సభ నడుపుతున్నాడని, సార్ను పొగిడిన వారే ప్రభుత్వంలో ఉంటారని, లేదంటే బయటకు పంపిస్తారన్నారు. చింతమడకలో ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినట్లు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి 10 లక్షలు ఇవ్వాలన్నారు. తెలంగాణలోని పేద వారికి మాత్రం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టివ్వలేదన్నారు.