- కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే ఎక్కడుండే వారు
- అద్భుతాలు చేశామంటున్న వారు ఏం చేశారో చెప్పాలి
- రెండేళ్లుగా రాష్ట్రంలో రుణమాఫీ ఏమయ్యింది
- కెసిఆర్, మంత్రుల విమర్శలపై ఫైర్ అయిన జానారెడ్డి
రెండుమార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని జానారెడ్డి విమర్శించారు. దేశంలో తొలిసారి ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణను ప్రకటించడంలో కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలే ఇప్పుడు తెలంగాణాకు రాబడిని తీసుకొస్తున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ , రూపాయికి కిలో బియ్యం వంటి అనేక పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. కుల,మతాలకతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందించిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే దేశం, రాష్ట్రంలో అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని జానారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని కేసీఆర్ గుర్తించాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే టీఆర్ఎస్ ఏం చేసేదని జానారెడ్డి ప్రశ్నించారు.
రెండేళ్లుగా రాష్ట్రంలో రుణమాఫీ ఊసే లేదని తెలిపారు. రుణమాఫీ లేక రైతులపై మరింత భారం పడుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ఇష్టానుసారం మాట్లాడితే చూస్తు ఊరుకోమని జానారెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు అబద్దాలు చెప్తున్నారని.. కాంగ్రెస్పై బురుద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నారని.. అరేండ్లలో అద్భుతం చేశాం అంటున్నారని జానారెడ్డి పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా..? 10 వేల ఎకరాలు కూడా దళితులకు ఇవ్వలేదన్నారు. 10 లక్షల ఎకరాల భూమి పంచిన చరిత్ర కాంగ్రెస్దని… మేము ఇచ్చిన భూమి టీఆర్ఎస్ ఇవ్వాలనుకుంటే… 2 లక్షల కోట్లు పెట్టాల్సి వస్తుందని తెలిపారు. నాగార్జున సాగర్ ఓటర్లు ఆలోచించుకోవాలని జానారెడ్డి సూచించారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగిందని.. తాము చేసిన అభివృద్ధితో వచ్చిన ఆదాయాన్ని టీఆర్ఎస్ పంచిపెడుతుందన్నది గుర్తు పెట్టుకోవాలని చురకలు అంటించారు. మెట్రో రైలు, హైవేలు తెచ్చింది కాంగ్రెస్ కాదా… అద్భుతాలు అంటున్నారు…వి•రు సాధించిన అద్భుతాలు ఏంటో చెప్పండి అని నిలదీశారు.ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్.. బకాయిలు మాఫీ చేసింది కాంగ్రెస్సే అని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు నాటికి 70 వేల కోట్ల అప్పు ఉందని…అరేండ్లలో మూడున్నర లక్షల కోట్ల అప్పు చేయడం అద్బుతమా..? అని ప్రశ్నించారు. మంచిని అభినందించండి అని చెప్పే టీఆర్ఎస్… కాంగ్రెస్ అభివృద్ధిని అభినందించాదా..? అని నిలదీశారు. రైతు బంధును అభినందిస్తున్నాము… కానీ రైతు రుణమాఫీ ఏమైందని ఫైర్ అయ్యారు. ఇతరుల్ని అభినందించండి అని అడిగే ముందు… వి•రు కూడా కాంగ్రెస్ ని అభినందించడం నేర్చుకోవాలని సూచించారు.