“భారతదేశ 13వ రాష్ట్రపతిగా 25 జూలై 2012 నుండి 25 జూలై 2017 వరకు ప్రథమ పౌరుడిగా విధులు నిర్వహించిన ప్రణబ్ విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో ‘‘భారతరత్న’’ పురస్కారంతో సన్మానించింది. దీనికి తోడుగా పద్మ విభూషణ్ (2008) ఆవార్డు కూడా వారిని వరించింది. అంతర్జాతీయ వేదికలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆనర్ (2013), నేషనల్ ఆనర్ ఆఫ్ ఐవరీ కోస్ట్ (2016), సైప్రస్ వారందించిన ఆర్డర్ ఆఫ్ మకారియోస్ (2017) పురస్కారాలను పొందారు. ప్రణబ్ ముఖర్జీ ప్రతిభను గుర్తించిన 16కు పైగా దేశ విదేశీ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను అందించాయి. ప్రపంచ ఉత్తమ ఆర్థికశాఖ మంత్రి (1984), ఏసియా ఉత్తమ ఆర్థిక శాఖ మంత్రి (2010) మరియు దేశ ఉత్తమ ఆర్థిక శాఖామాత్యులు(2010)గా పురస్కారాలను పొంది దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు, ట్రబుల్ షూటర్గా పేరొందిన మేధావి మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ పలు పుస్తకాలను రచించారు. తన అపూర్వ రాజకీయ సామాజిక అనుభవాలను జోడించి మిడ్టర్మ్ పోల్, ఛాలెంజెస్ బిఫోర్ ది నేషన్, థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్, ది టర్బ్యులెంట్ ఇయర్స్, కోలిషన్ ఇయర్స్ లాంటి ముఖ్య గ్రంథాలను తీసుకువచ్చారు.”
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు సమర్థవంతంగా చేపట్టి, పేరు ప్రఖ్యాతులు గడించి, భారత 13వ రాష్ట్రపతిగా (2012-17) దేశానికి సేవలందించిన ‘భారతరత్న’ ప్రణబ్ ముఖర్జీ జాతీయ అంతర్జాతీ యంగా నిబద్దతగల ఆదర్శ నాయకుడుగా, ప్రజా సేవకుడుగా తనదైన ముద్ర వేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర భీర్భం జిల్లాలోని మిరాటి గ్రామంలోని బెంగాలీ కుటుంబంలో కమద కింకర్ ముఖర్జీ మరియు రాజ్యలక్ష్మిలకు 11 డిసెంబర్ 1935న జన్మించారు ప్రణబ్ ముఖర్జీ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న తండ్రి కమద కింకర్ 1952-64 మధ్య బెంగాల్లో యంయల్సిగా మరియు ఏఐసిసి సభ్యుడుగా సేవలందించి, ప్రణబ్కు ఆదర్శ పితగా రాజకీయ క్షేత్రానికి దారి చూపారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో యంఎ రాజనీతి శాస్త్రం మరియు చరిత్రలలో పట్టాలు పొంది, యల్యల్బి పూర్తి చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించటానికి పూర్వం తంతి తపాలాల కార్యాలయంలో క్లర్క్ ఉద్యోగం, కాలేజ్లో లెక్చరర్ మరియు జర్నలిస్ట్ బాధ్యతలను స్వల్ప కాలం చేపట్టిన పిదప 1969లో రాజకీయరంగ ప్రవేశం చేశారు.
అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ దృష్టిని ఆకర్షించి అఖిల జాతీయ కాంగ్రేస్లో తన విలక్షణ సేవలను అందిస్తూ, 1969లో రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైనారు. అనంతర కాలంలో 1975, 1981, 1993 మరియు 1999లలో రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైనారు.గాంధీ కుటుంబానికి నమ్మిన భంటుగా అనేక సందర్భాలలో జఠిల సమస్యలను సులభంగా పరిష్కరించే మేధావిగానే కాకుండా ‘‘మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్’’గా ప్రత్యేక గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ (193-74), షిప్పింగ్ మరియు ట్రాన్స్ పోర్ట్ శాఖ (1974), ఆర్థిక శాఖ స్టేట్ (1974-75), రెవెన్యూ మరియు బ్యాంకింగ్ శాఖ (1975-77), కామర్స్ స్టీల్ మరియు మైన్స్ శాఖ (1980-82), ఆర్థిక శాఖ (1982-84 మరియు 2009-12), కామర్స్ మరియు సప్లై శాఖ (1984), వాణిజ్య శాఖ (1993-95), విదేశీ వ్యవహారాల శాఖ (1995-96 మరియు 2006-09), రక్షణ శాఖ (2004-06)లకు మంత్రిగా సమర్థవంతమైన సేవలను సుదీర్ఘకాలం అందించారు. ఇవే కాకుండా కాంగ్రేస్ పార్టీ కోశాధికారి, లీడర్ ఆఫ్ రాజ్యసభ, ప్రపంచ బ్యాంక్, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మన్, సార్క్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అధ్యక్షుడుగ, లీడర్ ఆఫ్ లోకసభ, ఏఐసిసి జనరల్ సెక్రెటరీ, పశ్చిమ బెంగాల్ కాంగ్రేస్ అధ్యక్షుడు లాంటి వివిధ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టిన ధీరుడు ప్రణబ్ ముఖర్జీ.
భారతదేశ 13వ రాష్ట్రపతిగా 25 జూలై 2012 నుండి 25 జూలై 2017 వరకు ప్రథమ పౌరుడిగా విధులు నిర్వహించిన ప్రణబ్ విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో ‘‘భారతరత్న’’ పురస్కారంతో సన్మానించింది. దీనికి తోడుగా పద్మ విభూషణ్ (2008) ఆవార్డు కూడా వారిని వరించింది. అంతర్జాతీయ వేదికలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆనర్ (2013), నేషనల్ ఆనర్ ఆఫ్ ఐవరీ కోస్ట్ (2016), సైప్రస్ వారందించిన ఆర్డర్ ఆఫ్ మకారియోస్ (2017) పురస్కారాలను పొందారు. ప్రణబ్ ముఖర్జీ ప్రతిభను గుర్తించిన 16కు పైగా దేశ విదేశీ విశ్వవిద్యాల యాలు గౌరవ డాక్టరేట్లను అందించాయి. ప్రపంచ ఉత్తమ ఆర్థికశాఖ మంత్రి (1984), ఏసియా ఉత్తమ ఆర్థిక శాఖ మంత్రి (2010) మరియు దేశ ఉత్తమ ఆర్థిక శాఖామాత్యులు(2010)గా పురస్కారాలను పొంది దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు, ట్రబుల్ షూటర్గా పేరొందిన మేధావి మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ పలు పుస్తకాలను రచించారు. తన అపూర్వ రాజకీయ సామాజిక అనుభవాలను జోడించి మిడ్టర్మ్ పోల్, ఛాలెంజెస్ బిఫోర్ ది నేషన్, థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్, ది టర్బ్యులెంట్ ఇయర్స్, కోలిషన్ ఇయర్స్ లాంటి ముఖ్య గ్రంథాలను తీసుకువచ్చారు.
1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం దేశ ప్రధానిగా అనుభవం లేని రాజీవ్ గాంధీని వ్యతిరేకించిన ప్రణబ్కు ప్రాధాన్యత తగ్గడంతో కాంగ్రేస్ను వీడి స్వంత పార్టీ రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రేస్ను స్థాపించి పరాజయం పాలైనారు. 1989లో తన పార్టీని కాంగ్రేస్లో విలీనం చేసి, 1991లో రాజీవ్ హత్య అనంతరకాలంలో పి వి నరసింహారావు ప్రధానమంత్రి సమయంలో తిరిగి పార్టీ మరియు ప్రభుత్వంలో తన పట్టు మరియు సత్తా చాటుకున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా 1975-77 ఎమర్జన్సీ కాలంలో వివాదాస్పదుడుగా పలు విమర్శలను ఎదుర్కొన్నారు. 1998లో కాంగ్రేస్ పార్టీ అధ్యక్ష్య స్థానంలో సోనియాగాంథీని ఎన్నికొనుటతో పాటు నమ్మకమైన ముఖ్య సలహాదారుగా ప్రధాన భూమిక నిర్వహించారు. సోనియా గాంధీ ప్రధానమంత్రిగా అంగీకరించని సమయంలో ఆ పదవిని ఆశించి (మన్మోహన్సింగ్ చేపట్టగా) విఫలమైనారు. తన ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్రలో 2004లో పశ్చిమ బెంగాల్ జంగీపూర్ నియోజకవర్గం నుండి తొలిసారి లోకసభ ఎన్నికల్లో గెలుపొందారు. మాజీ రాష్ట్రపతిగా ఆర్యస్యస్ సమ్మేళనంలో తన సందేశమిచ్చి అందరిని ఆశ్చర్య పరిచారు. 1977లో కాంగ్రేస్ ఓటమి తరువాత జనతా ప్రభుత్య హయాంలో ‘షా కమీషన్’ దర్యాప్తును ఎదుర్కొన్ని బయట పడ్డారు. 1982-84 మధ్య కేంద్ర ఆర్థిక శాఖామాత్యులుగా ఐయంయఫ్ చివరి ఇన్స్టాల్మెంట్ చెల్లించి దేశ ప్రతిష్టను పెంచడమే కాకుండా ఆర్బిఐ గవర్నర్గా మన్మోహన్ సింగ్ను నియమించిన ఘనత ప్రణబ్ ముఖర్జీది. అత్యున్నత ప్రతిభ, అనుభవం, సంక్లిష్ట ముడులు విప్పే చాతుర్యం కలిగిన ప్రణబ్ దాదా ఆదర్శ నేతగా, ప్రధాని హాజరు కాలేని సందర్భంలో కేబినెట్ సమావేశాలకు కూడా అధ్యక్షత వహించారు. జనాకర్షణ కలిగిన నేతగా కొంత విఫలమైనా, అపర మేధావిగా పేరొందిన ప్రణబ్, ప్రధానమంత్రిగా తన చిరకాల వాంఛను తీర్చుకోలేక పోయారు.
2012లో కాంగ్రేస్కి రాజీనామా చేసి రాష్ట్రపతిగా ఐదేళ్ళు సేవలందించారు. ఇందిర/రాజీవ్ పాలనలో కోర్ టీం సభ్యులుగా ప్రణబ్, పివి మరియు ఆర్ వెంకటరామన్ల త్రయం విశిష్ట సేవలు అందించారు. వీరిలో పివి ప్రధానిగా, మింగిన ఇద్దరు రాష్ట్రపతులుగా పని చేశారు. పార్లమెంటరీ పరిజ్ఞానం, మానవ సంబంధాలు, చతురత, అపార అనుభవం గుర్తించి ప్రణబ్ను ‘‘భారత ఉత్తమ పరిపాలనాదక్షుడు-2011’’ ఆవార్డును తీసుకున్నారు. ధర్మపత్ని సువ్రా ముఖర్జీని 1957లో వివాహమాడి ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. డెంగ్ గ్జియోపింగ్తో స్పూర్తిని పొందానని చెప్పుకున్న ప్రణబ్కు రీడింగ్, గార్డెనింగ్ మరియు సంగీతాలు హాబీలుగా మార్చుకొన్నారు. ఏ క్లిష్ట సమయంలోనైనా నిబ్బరంగా ఉంటూ, సమస్యలను గట్టెంకించటం ప్రణబ్ దాదాకే ప్రత్యేకం. కోవిడ్-19 సోకడంతో పాటు మెదడుతో రక్తం గడ్డకట్టడంతో ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడం విచారకరం. ఆంధ్ర రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షత వహించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసారు. పార్టీలకు అతీతంగా అజాత శత్రువుగా, మహా మేధావిగా, స్టేట్స్ మెన్గా, రాజకీయ కురువృద్ధుడుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవలు అనన్య సామాన్యాలు మరియు అనితర సాధ్యాలు. వారికి భరతజాతి రుణపడి ఉంది. భరతజాతి రత్నమైన ప్రణబ్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ, ఆకాంక్షలను నెరవేర్చడమే వారికి మనం సమర్పించే ఘన నివాళి.

విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల, కరీంనగర్ -99497 00037