- ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ అరెస్ట్
- కోర్ట్ తీర్పు రాకముందే పరీక్షల నోటిఫికేషన్పై నిరసన
- అరెస్ట్ని ఖండించిన కాంగ్రెస్ నేతలు
తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్ఎస్యూఐ ప్రగతి భవన్ ముట్టడించింది.హై కోర్ట్లో పిటీషన్ పెండింగ్ ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బుధవారం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ… రోజురోజుకు కొరోనా కేసులు పెరుగుతున్నా టెస్టుల గురించి పట్టింపు లేని ప్రభుత్వానికి విద్యార్థుల జీవితాలపై కూడా పట్టింపు లేదని మండిపడ్డారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్నా కూడా ప్రభుత్వం తన నిరంకుశ మొండి వైఖరితో అనాలోచితంగా విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టే రీతిలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని నిరసిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే పరీక్షలు నిర్వహించ కుండా విద్యార్థులందరిని ప్రమోట్ చెయ్యాలని, అదే విధంగా కొరోనా ఉధృతిని అరికట్టడానికి వెంటనే ప్రభుత్వం కొరోనా టెస్టులను పెంచాలని వారు డిమాండ్ చేశారు.
పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదం
ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ అరెస్ట్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆయనను పరామర్శించాడనికి వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఆడుకున్నారు. దీంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీస్ల తీరుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డరు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని, తామూ ప్రభుత్వాలు చూసినవాళ్ళమే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత సంగతి చూస్తామని అన్నారు. వెంకట్ని పరామర్శించడానికి గోశామహల్ పోలీస్ గ్రౌండ్కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నేతలు విక్రమ్ గౌడ్, అనిల్ కుమార్ యాదవ్ తదితర నేతలు వెళ్ళారు.
వెంకట్ అరెస్ట్ని ఖండించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
బలమూరి వెంకట్ రావు అరెస్ట్ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు సంఘ విద్రోహశక్తులు కాదని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థుల పక్షాన ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా విధానం గందరగోళంలో ఉందని, 62 లక్షల మంది విద్యార్థుల కోసం పోరాడిన వాళ్ళను అరెస్ట్ చేస్తారా..? అని మండిపడ్డారు. వెంకట్ అరెస్ట్ని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విహెచ్ తీవ్రంగా ఖండించారు.