శిశుపాలుడి తప్పులు మాదిరిగా, తెలంగాణ సీఎం కేసీఆర్ గారి తప్పులు రోజురోజుకు పెరిగి పోతున్నాయని కాంగ్రెస్ టీపీసీసీ చైర్ పర్సన్ విజయశాంతి విమర్శిం చారు.మంగళవారం ఆమె ఒక పత్రిక ప్రకటన చేశారు.ఈ ప్రకటన లో ఇంతకాలం ప్రజాతీర్పు తనకు అనుకూలంగా ఉందని విర్రవీగిన పోయిన దొరగారు త్వరలో తెలంగాణ ప్రజల తిరస్కారాన్ని, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేసే కెసిఆర్ గారు… కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారిందని మండిపడ్డారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదు అని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే సీఎం దొరగారు దాన్ని అవహేళన చేశార ధ్వజమెత్తారు.
కరోనా కట్టడికి తగిన వైద్య వసతులు లేవని పత్రికల్లో వార్తలు వస్తే.. వాటి యాజమాన్యంపై కెసిఆర్ గారు శాపనార్థాలు పెట్టారని తెలిపారు. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టినా సీఎం దొరగారు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇక పరిస్థితి చేయి దాటి పోతుంది అని గ్రహించి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ ఇసై సౌందరరాజన్ గారు స్వయంగా జోక్యం చేసుకుని, సంక్షోభ నివారణకు చొరవ తీసుకుంటే… దానిని కూడా సీఎం దొరగారు అడ్డుకోవడం నిరంకుశత్వానికి పరాకాష్ట అన్న విమర్శలు వినిపిస్తున్నాయని ఆరోపించారు.ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారు తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన కారణంగా, గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు సైతం స్వాగతిస్తున్నారని అన్నారు .ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం కంటే, సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం మేలని సూచించారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజ ఆగ్రహ జ్వాలలు తారా స్థాయికి చేరుతాయనడంలో సందేహం లేదని హెచ్చరించారు.