సిద్ధమవుతున్న కార్మిక, రైతు సంఘాలు
న్యూఢిల్లీ, నవంబర్ 24 : దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలో ఉన్న దాదాపు 20 కోట్ల మంది కార్మికులు రేపటి సార్వత్రిక సమ్మెలో పాల్గొనబోతున్నారు. పది కేంద్ర కార్మిక సంఘాలు, డజన్ల సంఖ్యలో ఉన్న స్వంతంత్ర ఫెడరేషన్లు ఉమ్మడిగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆర్ఎస్ఎస్కి చెందిన భారతీయ మజ్దూర్ సంఘ్ తప్ప మిగిలిన కార్మిక సంఘాలన్నీ సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలతో సమన్వయం చేసుకుంటూ ఈనెల 26, 27 తేదీల్లో దేశవ్యాపితంగా ఆందోళనలకు దాదాపు 300కు పైగా రైతు సంఘాలు పిలుపు నిచ్చాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది రైతులు నిరసన తెలపడానికి ఢిల్లీకి చేరుకుంటున్నారు. స్టీలు, పోర్టులు, బొగ్గు, టెలికమ్, ఇంజనీరింగ్, రవాణా, రక్షణ ఉత్పత్తులు లాంటి ఉత్పాదక రంగ సంస్థలతోపాటు సేవల రంగానికి చెందిన బ్యాంకులు, బీమా సంస్థకు చెందిన ఉద్యోగులు, కార్మికులంతా ఈనెల 26వ తేదీన సమ్మెలో పాల్గొనబోతున్నారు.
ప్రభుత్వ స్కీమ్ వర్కర్లయిన ఆశా వర్కర్లు, మధ్యాహం బోజనం కార్మికులు, ఎఎన్ఎమ్లతోపాటు మహిళా ఉద్యోగులంతా సమ్మెలో పాల్గనబోతున్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా రైతులు ఈనెల 26వ తేదీన మొదలు పెట్టి మరుసటి రోజు కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు, రాష్ట్ర శాసనసభల ముందు ధర్నా కార్యాక్రమాలను నిర్వహిస్తారు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో గ్రావి•ణ బంద్ను పాటిస్తారు. ఈ నేపథ్యంలోప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ డిమాండ్లు సాధించుకునేందుకు కార్మిక వర్గం సమ్మెకు పిలుపునిచ్చింది. కనీస వేతనం 21 వేల రూపాయలకు పెంచాలి, నెలకు పది వేల రూపాయల పెన్షన్, అవసరమున్న కుటుంబాలకు నెలకు పది కేజీల ఆహార ధాన్యాలు, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలి, పన్ను కట్టని కుటుంబాలకు నెలకు 7,500 రూపాయల నగదు బదిలీ, లేబర్ కోడ్లను ఉపసంహరించాలి, మూడు వ్యవసాయరంగ చట్టాలను ఉపసంహరించాలి, నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించాలి, జీడిపిలో ఐదు శాతం విద్యకు కేటాయించాలి, అందరికీ వైద్యం, అందుకోసం జిడిపిలో ఆరు శాతం కేటాయించాలి, నూతన విద్యుత్ సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించాలి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసారి అన్ని కార్మికసంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ, రైతు సంఘాల సమన్వయ కమిటీ కలిసి కూర్చొని పూర్తిస్తాయిలో సమన్వయం చేసుకొని ఈ నెల 26,27 తేదీల్లో ఆందోళనలకు పిలుపునిచ్చాయి.