నిర్భయ గ్యాంగ్రేప్ హత్య కేసులో నలుగురు దోషులకు మార్చి 20 శుక్రవారం ఉరితీయనున్నారు. ఉరిశిక్షను నిలిపివేయాలంటూ దోషులు చేసుకున్న అభ్యర్ధనను ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కొట్టి వేసింది. పవన్ గుప్తా నేరం చేసినప్పుడు తాను జువనైల్ అని చెబుతూ.. సామూహిక అత్యాచారం, హత్య జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని కూడా పవన్ సింగ్ తన అభ్యర్థనలో తెలిపాడు. ఉరిశిక్ష నిలుపుదల అభ్యర్ధనను సుప్రీమ్ కోర్టులో సమర్పించగా, అత్యున్నత న్యాయస్థానం పవన్ గుప్త పిటిషన్ తిరస్కరించింది. అటుపై, ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష అమలుపై స్టే పిటిషన్ను ఎత్తివేసింది. దీనితో నలుగురు దోషులకు రేపు తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరి తీయనున్నరు.
దోషులు తమకు ఉన్న చట్టపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించు కోవటానికి ప్రయత్నిస్తున్నందున, ఉరిశిక్ష అమలుకు 7 సంవత్సరాలు పైచిలుకు పట్టింది. ఇప్పటి వరకు దోషుల ఉరిశిక్ష అమలు మూడుసార్లు వాయిదా పడింది. పవన్ గుప్తా పిటిషన్ను సుప్రీమ్ కోర్టు కొట్టివేసిన కొద్ది నిమిషాల తరువాత, తన కూతురుకు రేపు న్యాయం జరుగుతుందని నిర్భయ తల్లి ఆశా దేవి తెలిపారు. ‘‘కోర్టు దోషులకు చాలా అవకాశాలను ఇచ్చింది, వారిని వేలాడదీయడానికి ముందు ఏదో ఒకవిధంగా పిటిషన్ వేసి వారి ఉరిశిక్షని వాయిదా వేయడం జరిగింది. రేపు నిర్భయకు న్యాయం జరుగుతుంది’’ అని ఆశా దేవి అన్నారు.
గత సోమవారం, మరణశిక్ష పడిన ముగ్గురు దోషులు మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి అత్యవసర విచారణ విజ్ఞప్తి చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. దోషులు తమ న్యాయవాది ఎపి సింగ్ ద్వారా ఓ పిటిషన్ను అంతర్జాతీయ న్యాయస్థానం ముందు వేశారు. ఈ పిటిషన్లో డెత్ వారెంట్లను అమలు చేయడం చట్టవిరుద్ధమని ఏపీ సింగ్ పేర్కొన్నారు. అంతేకాదు ఢిల్లీలో కరోనావైరస్ వ్యాప్తి వల్ల, ప్రపంచ వ్యాప్తంగా పడిపోతున్న గాలి నాణ్యత కారణంగా ఢిల్లీ ఎన్సిఆర్ ఇతర రాష్ట్రాలు కూడా వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలుపుతు.. ఎలాగూ మరణించే వారికి ఉరిశిక్ష అమలు అవసరం లేదని, దోషుల తరుపు న్యాయవాది అంతర్జాతీయ కోర్టుకు చెప్పటం గమనించాల్సిన అంశం.