నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు 1991, ఏప్రిల్ 29 నుండి మే 3వ తేదీవరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండ్ హాక్ నగరంలో సమావేశం ఏర్పాటుచేసి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు వచ్చాయి. ఆఫ్రికన్ జర్నలిస్టుల నిరసనగా గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని 1993, డిసెంబరు నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించడం కూడా జరిగింది.అప్పటినుంచి ప్రతి సంవత్సరం మే 3వ తేదీనపత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంను జరుపుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియా రంగానికి కష్టకాలంలో ఉంది. మీడియాకు స్వేచ్ఛ ఎండ మావే అవుతున్నది. మే 3వ తేదీ ‘‘ప్రపంచ పత్రికా స్వేచ్చాదినం’’, నవంబరు 16న ‘‘భారత పత్రికా దినం’’. ఇలా ఎన్ని దినోత్సవాలు జరిపినా పరిస్ధితులలో మార్పు రాక పోవడం విచారకరం.
భారత స్వాతంత్య్రానికి ముందు కూడా మీడియాలో రెండు తరగతులు వుండేవి. ఒకటి స్వాతంత్య్ర లక్ష్యం కోసం ప్రధానంగా పని చేసినవి, రెండవ తరగతి బ్రిటీష్ సామ్రాజ్య వాదులతో ఘర్షణ పడకుండా స్వామికార్యం, స్వకార్యం నెరవేర్చుకొనేవి. తరువాత దేశ మీడియాలో ఆగీత చెరిగి పోయింది. ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద కేంద్రీకరణ లేదు. ఎవరు అధికారంలో వుంటే వారికి అనుకూలంగా, పెట్టుబడిపై లాభాలను ఆర్జించే వ్యాపకంగా మారింది. అందుకోసం వార్తను, దృశ్యాన్ని వ్యాపార సరకులుగా మార్చి వేశారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ వారిని వ్యతిరేకిస్తూ పత్రికలు పెట్టిన ఎందరో తమ ఆస్తులను ఫణంగా పెట్టారు. ప్రస్తుతం అధిక సంఖ్యాక పత్రికలు, చానళ్లు లాభాల కోసం నడుస్తున్నవే. మా పత్రిక ధర మీరు కొనే సమోసా కంటే తక్కువే అని గతంలో ఒక మీడియా సంస్ధ ప్రచారం చేసుకుంది. ఇప్పటికీ పత్రికలు సమోసా కంటే తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఒక్క పత్రికలు తప్ప ప్రపంచంలో ఏ వస్తువూ తయారీ ధరకంటే తక్కువకు లభ్యం కావటం లేదు. దీని అర్ధం వాటి నిర్వాహకులు తనకు తగిన ఆదాయం, లాభాలు లేకుండా నడుపుతున్నారనా? టీవీ ఛానల్స్ కూడా అంతే. కొన్ని పార్టీలు, వాటి నేతలు, వ్యాపార సంస్ధల వార్తలను ఇస్తే ఏదో మార్గంలో కాసులు కురుస్తాయి. కొన్నింటికి మాత్రమే ఎలాంటి ప్రతిఫలమూ వుండదు. అందుకే నేడు నూటికి తొంభై తొమ్మిది సంస్ధలు మాకేమిటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి వాటికి భావ ప్రకటనా స్వేచ్చ వుంటేనే లేకపోతేనేం. నేడు మీడియా సంస్ధలను డబ్బులు సంపాదించే పెట్టుబడి దారులు నడుపుతున్నారు తప్ప సంపాదకులకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా పోతోంది. సంపాదన, అధికారం ధ్యేయాలైన మీడియా నిర్వాహకులు వార్తలను అమ్ము కోవటానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ కారణంగానే గతంలో, ప్రస్తుతం ఎవరు అధికారంలో వున్నా మీడియాను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిచడం కొనసాగుతున్నది.
లొంగని వాటి ఆర్ధిక మూలాలను దెబ్బ తీసేందుకు, తద్వారా వాటి మూతకు ప్రయతాలు జరుగడం నిత్య కృత్యమే. మీడియా స్వేచ్చకు కలుగుతున్న హాని గురించి ఒక్క మాట కూడా రాయలేని నిస్సహాయ సంపాదకులను నేడు మనం చూస్తున్నాం. ఫోర్త్ ఎస్టేట్గా మన్నననలను పొందిన మీడియా రియలెస్టేట్గా మారిపోయిందనే ఆరోపణలు నిత్యం వినాల్సి వస్తోంది. మీడియా యజమానులు, రాజకీయ నేతలకు మధ్య వున్న గీత దాదాపుగా చెరిగిపోయింది. ఒకరి ప్రయోజనాలను ఇంకొకరు కాపాడు కుంటున్నారు. కొందరు రాజకీయ నేతలు స్వయంగా మీడియా సంస్ధలను ఏర్పాటు చేసుకున్నారు. అధికారంలో వున్నపుడు దానిని అడ్డుపెట్టుకొని లాభాలు సంపాదించటం, ప్రతిపక్షంలో వున్నపుడు వాటినే పెట్టుబడిగా పెట్టి నిలుపుకోవటం గతంలో జరుగుతున్నదే. ఇప్పుడు రాజకీయ నేతలు, వారి కనుసన్నలలో మెలిగే మీడియా సంస్ధలు ఎక్కడ అధికారం వుంటే ఆవైపే చేరటం రివాజుగా మారింది.
దేశంలోని గుత్త పెట్టుబడిదారీ సంస్ధలు మీడియా రంగంలో ప్రవేశించటంతో పత్రికా స్వేచ్ఛ హరించుకు పోతున్నది. పాలక పక్షాలు స్వార్థమే పరమార్థంగా వ్యవహరిస్తున్నా యన్నది స్పష్టం. గతంలో కాంగ్రెస్ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి మీడియా వార్తలపై ప్రత్యక్ష సెన్సార్షిప్ విధించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ లేదా బిజెపి వాటితో జట్టుకట్టే పాలకవర్గ ప్రాంతీయ పార్టీలు మీడియా మీద పరోక్ష సెన్సార్ను అమలు జరుపు తున్నాయి. వారికి ఇష్టం లేని వార్త అసలు రాక పోవటం లేదా కనిపించీ కనిపించకుండా ఒక మూలన పడవేయటమో జరుగుతోంది. తమ విధానాలను ప్రశ్నించిన మీడియా సంస్దలకు ప్రకటనలు నిలిపి వేయటం, టీవీ ఛానల్స్ అయితే కేబుల్ నిర్వాహకులను బెదిరించి ఛానల్స్ ప్రసారాలను అడ్డు కోవటాన్ని చూస్తున్నాం. మన దేశంలో గత కొన్నేళ్లుగా కుహనా వార్తలు సామాజిక మాధ్యమాన్ని ముంచెత్తు తున్నాయి. నిజం మూడు అడుగులు వేసే లోగా అబద్దం ముప్పై అడుగుల ముందు వుంటోంది. అవన్నీ ఒక పధకం ప్రకారమే వెలువడు తున్నాయి. ఏది నిజమో ఏది కాదో తెలుసుకోలేని గందరగోళంలో జనాన్ని పడ వేసేందుకు, నిజాన్ని కూడా ఒక పట్టాన నమ్మకుండా చేసేకుట్ర దీనిలో వుంది. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్ ప్రభుత్వంలో మంత్రిగా వున్న గోబెల్స్ ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుంది అన్న సూత్రంతో పని చేశాడు. ఇప్పుడు మనిషి మనిషికీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావటంతో గోబెల్స్లు వికటాట్టహాసం చేస్తున్నారు.
వెనుకా ముందూ చూడకుండా వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారాన్ని ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ఎత్తిపోస్తున్నారు. అవాస్తవాలు, వక్రీకరణలు ప్రచారం చేస్తూ, నకిలీలను నిజమైనవిగా చిత్రించటం మనకు నిత్యం అనుభవైక వేద్యమే. ప్రధాన స్రవంతి మీడియా సంస్ధలు కూడా ఇందుకు తమవంతు తోడ్పాడును అందిస్తున్నాయి. అందువలన నిజమైన వార్తలు, నిజమైన పత్రికా, మీడియా స్వేచ్చ అంటే జనం కూడా గందర గోళానికి గురి అవుతున్నారు. మన దేశంలో 1956లో ఏర్పాటు చేసిన తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సుల మేరకు 1966 నవంబరు 16న ప్రెస్ కౌన్సిల్ ఏర్పడింది. ఆ రోజును జాతీయ పత్రికా దినంగా పాటిస్తూ 1997 నుంచి ప్రెస్ కౌన్సిల్ ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. భారతదేశంలోనే కాకుండా చాలా ప్రపంచ దేశాలలో ప్రెస్ కౌన్సిళ్ళు ఉన్నాయి. అయితే భారతదేశ కౌన్సిల్కు ఉన్న ప్రత్యేకత, గుర్తింపు ఏమంటే ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం లభించడమే. స్వేచ్చాయుతమైన, జవాబుదారీ తనంతో కూడినదిగా మీడియా వుండాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఆచరణలో స్వేచ్చను హరించే వారిని, అడ్డగోలుగా వ్యవహరించే మీడియా సంస్ధలనూ సరైన దారిలో పెట్టటం దాని లక్ష్యం. లక్ష్య సాధనకు ప్రెస్ కౌన్సిల్ పూర్తిగా అంకితం కావాలని ఆశిద్దాం.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494