తిరుపతి, ఫిబ్రవరి 11 : తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణం తో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్తోక్త్రగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మ వారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఉత్సవమూర్తుల సమక్షంలో న లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు మణిస్వామి, కంకణభట్టర్ ఉదయస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్తోక్త్రగా జరిగింది. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్స వాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది.
దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు. అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామి వారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.రాత్రి 8 నుంచి 10 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో విహరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ పార్ధసారథి, సూపరింటెండెంట్ భూపతి, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభం
నంద్యాల, ఫిబ్రవరి 11 : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ఈనెల 21 వరకు నిర్వహించ నున్నట్టు ఈవో లవన్న తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజావరోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రేపటి నుంచి స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈవో తెలిపారు. 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహనసేవ, 14న మయూర వాహనసేవ, 15న రావణ వాహనసేవ, 16న పుష్పపల్లకీ సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవను భక్తుల సమక్షంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
అదేవిధంగా లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తామని వివరించారు. 19న రథోత్సవం, తెప్పోత్సవం, 20న యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, 21న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఈనెల 13న దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, 14న ఉదయం శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవస్థానం, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వివరించారు.