ఎన్నికలనగానే ప్రచారం, మ్యానిఫెస్టోలు, వ్యూహాలు, ప్రతి వ్యూహా, ఆరోపణలు, విమర్శలు ఎంత మామూలో ఈ మధ్య కాలంలో సవాళ్లు, ప్రతి సవాళ్లకు కాస్తంత డ్రామ ఫ్లేవర్ ను కూడా నాయకులు జోడిస్తున్నారు. ఈ 17వ తేదీన జరుగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ అన్ని ఎలిమెంట్స్ కు చోటు దక్కింది. రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.
సంక్షిప్తంగా
వైసీపీ ఎమ్పీ బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో తిరుపతి లోక్ సభ సెగ్మెంట్ లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. దుర్గా ప్రసాద్ కుమారుడిని శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన వైసీపీ అధినేత జగన్, పాదయాత్రలో తనకు వైద్య చికిత్సలు అందించిన పార్టీ నేత డా. గురుమూర్తిని ఎన్నికల బరిలో నిలబెట్టారు. అటు టీడీపీ మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీని, బీజేపీ-జనసేన కూటమి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు బీ ఫార్మ్ ఇచ్చారు.
తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరు నేపథ్యంలో తిరుపతిలో వైసీపీ గెలుపు ఖాయం అని ప్రతిపక్షాలు సైతం ఆఫ్ ది రికార్డుల్లో అంగీకరిస్తున్నాయి. వైసీపీ మెజార్టీ పైనే ప్రస్తుతం చర్చ అంతా. అలా అని ఆడకుండానే ఆటను ముగించలేరు కనుక టీడీపీ, బీజేపీ-జనసేన తమ శక్తి యుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. కనీసం మెజార్టీ అయినా తగ్గించగలిగితే తాము నైతికంగా విజయం సాధించినట్లే అన్నది విపక్షాల లెక్క.
లోక్ సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు బాధ్యతను వైసీపీ ఒక్కో మంత్రికి అప్పగించింది. వీరే స్టార్ క్యాంపైనర్లుగా వ్యవహరిస్తున్నారు. అటు టీడీపీ నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వారం, పది రోజుల నుంచి తిరుపతిలోనే మకాం వేసి పావులు కదుపుతున్నారు. బీజేపీ అభ్యర్ధికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి దిగినా…ఆయనతో సన్నిహితంగా మెలిగిన పలువురు కోవిడ్ బారిన పడటంతో పవన్ కళ్యాణ్ ప్రచారానికి స్వస్తి పలికి హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. బీజేపీ పొరుగున ఉన్న తెలంగాణా రాష్ట్రం నుంచి నేతలను ప్రచారానికి రప్పించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం క్యాంపైన్ చేశారు.
సవాళ్ళ రాజకీయం
ఇక సవాళ్ల పరవం చూస్తే ఈ అంశంలో టీడీపీ ముందంజలో ఉంది. రాజీనామాల ఛాలెంజ్ లు, ప్రణామాలు సవాళ్లు విసిరి వైసీపీని కవ్వించే ప్రయత్నం చేసింది. రాజీనామాల సవాళ్లకు బీజం వేసింది మాత్రం సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే తమ 22 మంది ఎమ్పీలు రాజీనామా చేస్తారు, వైసీపీ గెలిస్తే టీడీపీ ముగ్గురు ఎమ్పీలు రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. ఈ లీడ్ తీసుకున్న టీడీపీ తిరుపతి ఎన్నికల పై కాకుండా ప్రత్యేక హోదా పై అందరం రాజీనామా చేద్దాం అని సవాలు విసిరింది. ఈ ఎన్నికల క్షేత్రంలో నారా లోకేష్ ను మాస్ లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసే ఓ ప్రయత్నాన్ని టీడీపీ అనుసరిస్తోంది. బాబు తనయుడు అయినా ఇప్పటికీ ఇంటా, బయట నాయకుడిగా ఇమేజ్ తెచ్చుకోవటంలో విఫలమవుతున్న లోకేష్ కు ఈసారి మాస్ డైలాగుల స్క్రిప్ట్ ఇచ్చి కార్యకర్తల్లో అయినా కాన్ఫిడెన్స్ తెచ్చే ప్రయోగం జరుగుతోంది. అందుకే వైసీపీ ఎమ్పీలను పిల్లులు, కోతులు అంటూ అభివర్ణిస్తున్నారు లోకేష్. వీటన్నింటికి మించి సీఎమ్ వర్సెస్ లోకేష్ అనే ఒక ప్రచారం కోసం కూడా టీడీపీ వ్యూహకర్తలు ప్రయత్నిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య విషయంలో వెంకన్న పై ప్రమాణం చ్ఱేయటానికి రావాలని లోకేష్ జగన్ కు సవాలు విసిరారు. స్వయంగా తానే మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ కు సింగిల్ హ్యాండ్ తో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ కు సవాలు విసిరే స్థాయి లేదని వైసీపీ నేతలు కొట్టిపారేశారు.
డ్రామా ఎలిమెంట్
ఇక ఎన్నికల సమయంలో ఓటర్ల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, సానుభూతి పవనాల కోసం ప్రయత్నాలు వంటి నాయకుల గిమ్మిక్కులు మనకు అలవాటే. చంద్రబాబు తన బహిరంగ సభలో వైసీపీ రాళ్ల దాడికి పాల్పడిందని రెండు రోజుల కిందట రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక చిన్నపాటి రాయి పట్టుకుని రోడ్డు పై బైఠాయించటంతో హైడ్రామా వాతావరణం నెలకొంది. ఆ వెంటనే ఒక బృందం విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. రెండో రోజు ఢిల్లీకి మరో బృందం వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల విచారణలో రాయి వేసినట్లు ఆధారాలు దొరకలేదు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి అని పోలీసులు చంద్రబాబుకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇన్నీ ఎత్తుగడలకు బ్రేక్ వేసింది కొసమెరుపుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు వీడియో లీక్.
ఓ టీడీపీ సీనియర్ నేత చంద్రబాబు, లోకేష్ తనను ఏ రకంగా వాడుకుని వదిలేశారో అచ్చెంనాయుడుకు వివరిస్తున్న నేపథ్యం ఈ వీడియోలలో కనిపిస్తుంది. ఆర్ధికంగా రోడ్డున పడిన తన కుటుంబాన్ని ఆదుకోకపోగా ఆత్మహత్య చేసుకోమని చెప్పారని సదరు నేత అచ్చెంనాయుడుకు వివరిస్తున్నారు ఆ వీడియో క్లిప్ లో. దీనికి స్పందిస్తు అచ్చెంనాయుడు లోకేష్ వల్లే పార్టీ ఇలా ఉందని, 17 తర్వాత పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఈ వీడియో సంచలనంగా మారింది. రాజకీయ పార్టీల ఎత్తులు, పై ఎత్తులు ఏ రకంగా ఉన్నా… చివరకు నిర్ణయించాల్సింది ఓటరే. 17న తిరుపతి ఓటర్ ఏం తీర్పు ఇస్తారో మే 2వ తేదీన తేలుతుంది.