సహకరించిన మెట్రో అధికారులు
హైదరాబాద్ మెట్రో రైలులో తొలిసారి బ్రెయిన్ డెడ్ అయిన మనిషి గుండెను వైద్యులు తరలించారు. మెట్రో రైలు అధికారుల సహకారంతో అపోలో హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా గుండెను తరలించారు. నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్యక్తికి అమర్చనున్నారు.
జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి గుండె మార్పిడి శస్త్రచికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్టర్ గోకులే నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్కి గుండెను తరలించారు. ఉప్పల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు ఉండే ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో మార్గాన్ని వైద్యులు ఎంచుకున్నారు. మెట్రో రైలు అధికారులకు హాస్పిటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఈ ఏర్పాట్లు చేశారు.
ముందుగా ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలోకు గుండెను ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం నాగోలు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకూ మెట్రో సర్వీస్ను నాన్స్టాప్గా నడిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో హాస్సిటల్ వరకు కూడా రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వైద్యులు మెట్రోను ఎంచుకున్నారు.