అరణ్య భవన్లో సంబంధిత అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష
సంగారెడ్డి, ఆందోల్, నారాయణ ఖేడ్, జహీరాబాద్లకు సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల ద్వారా సాగు నీరందేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.ఇవాళ ఆయన హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సంగారెడ్జి, మెదక్ జిల్లా నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొమరవెల్లి మల్లన్న సాగర్ నుండి కాలువల ద్వారా సింగూరు ప్రాజెక్టుకు వొచ్చే నీటిని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ ఖేడ్, ఆందోళ్ నియోజవర్గాలకు నీరందించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. దాదాపు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుందని చెప్పారు. జహీరాబాద్, నారాయణ్ ఖేడ్. సంగారెడ్డి నియోజవర్గాలకు తప్పకుండా నీరందించేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు.
ఆయన సూచనల మేరకు పకడ్బందిగా ఎక్కువ ఆయకట్టుకు నీరు అందేలా చూడాలని సూచించారు. త్వరలోనే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతోను, కలెక్టర్, ఆర్డీవోలతోను, నియోజవర్గ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ నాలుగు నియోజకవర్గాలకు సాగు నీరు అందించే విషయంపై కూలంకషంగా సమీక్ష చేస్తానని చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల ద్వారా ఈ నీటిని నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరు అందేలా ప్రణాళికలు ఉండాలన్నారు. సంగారెడ్డి జిల్లా సర్కిల్ పరిధిలోని ప్యాకేజి 17, ప్యాకేజి 18, ప్యాకేజీ 19 కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వేగంగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్దంగా పని చేయాలని ఆదేశించారు.
చాలా చోట్ల పనికిరాని యంత్రాలు స్క్రాప్ గా పడి ఉన్నాయని వాటన్నింటిని ఎప్పటికప్పుడు టెండర్లు పిలిచి డిస్పోజ్ చేయాలని సూచించారు. నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉన్న భూములకు రక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సంగారెడ్డి సీఈ వి. అజయ్ కుమార్, సంగారెడ్డి ఎస్. ఈ మురళీధర్, మెదక్ ఎస్. ఈ యేసయ్య, సంగారెడ్డి ఈ ఈ మధుసూదన్ రెడ్డి, జహీరాబాద్ ఈ ఈ సుబ్రమణ్య ప్రసాద్, నారాయణ ఖేడ్ ఈ ఈ రాజేంద్ర ప్రసాద్, నర్సాపూర్ ఈఈ కనగేశ్, మెదక్ ఈఈ శ్రీనివాసరావు, టీ ఈ ఐడీసీ ఈఈ ఖీమానాయక్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ మల్లయ్య, డీసీఈ ఎం. అమృతరావు పాల్గొన్నారు.