- కంటి వెలుగు ద్వారా
- కోటి 54 లక్షల మందికి పరీక్షలు
- మండలిలో మంత్రి వెల్లడి
- గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని త్వరలోనే డిశ్చార్జి చేస్తాం
తెలంగాణలో కొత్తగా కాకతీయ మెడికల్ కళాశాల, ఐపీఎం, ఫీవర్ ఆసుపత్రులలో కరోనా ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనాకు వైద్య చికిత్సలు అందించే ఆసుపత్రులలో ఎఫ్ఆర్ ఫిల్టర్లను పెడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతానికి ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదని రాష్ట్ర దుబాయి నుంచి వచ్చిన కరోనా సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ వాసికి తాజాగా రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా ఫలితం నెగెటివ్గా వచ్చిందని వెల్లడించారు. బుధవారం ఆయన కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
కరోనా అనుమానంతో వస్తున్న వారికి ఇప్పటికే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులలో టెస్టులు జరుగుతున్నాయని వెల్లడించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని త్వరలోనే డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా సోకితే చనిపోతారనే ప్రచారం తప్పనీ, ఈ వైరస్ వల్ల కేవలం 3 శాతం మాత్రమే డెత్ రేట్ ఉందని పేర్కొన్నారు. కరోనాకు ఇప్పటి వరకు ప్రత్యేకంగా మందులు లేవనీ ప్రస్తుతం దీనిపై పరిశోధనలు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. దీని నివారణకు త్వరలోనే మందులు వ్యాక్సిన్లు వస్తాయని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వ్యక్తులను శంషాబాద్ విమానాశ్రయంలోనే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో మరో మూడు కరోనా ల్యాబ్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతించిందని వెల్లడించారు.
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కోటి 54 లక్షల మందికి పరీక్షలు : ఈటల
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని కోటి 54 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి 40 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, వైద్యం కోసం పెడుతున్న ఖర్చుపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. ఈమేరకు బుధవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గంగాధర్గౌడ్, బోడకుంటి వెంకటేశ్వర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఉన్నత దేశాలలో ఏ విధంగా అయితే, ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తారో తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు.
ఇందులో భాగంగానే కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణలో అనేక వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టామనీ, ఈ ఆర్థిక సంవత్సరం నుంచే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నామనీ, క్యూరేటివ్ యాక్టివిటీలో భాగంగా పీహెచ్సి స్థాయి నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించినట్లయితే వారికి పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుందనీ, అలాగే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఆమేరకు విధి విధానాలను తయారు చేసుకుని ముందుకు వెళ్లనున్నట్లు మంత్రి ఈటల ఈ సందర్భంగా వెల్లడించారు.