- సౌదీ,లండన్,జర్మన్ నుంచి వచ్చిన వారికి పాజిటివ్
- 36కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 36కు చేరాయి. మంగళవారం మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లండన్ నుంచి వచ్చిన కోకాపేట వాసికి కరోనా సోకింది. జర్మనీ నుంచి వచ్చిన చందానగర్ మహిళకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన బేగంపేట మహిళకు(60) కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. లండన్ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, జర్మనీ నుంచి వచ్చిన చందానగర్కు చెందిన 39 ఏళ్ల వివాహితకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన బేగంపేటకు చెందిన 61 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్టుగా తెలిపింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణలో మార్చి 31వరకు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
లాక్డౌన్ అమలు, కరోనా వ్యాప్తి నిరోధ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వైద్యారోగ్య శాఖ, పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖతో పాటు తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. మరోవైపు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపడుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో సమాచార సేకరణ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వీరు పూర్తి స్థాయి రిపోర్ట్ అందించనున్నారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో బాధపడుతున్న వారి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలోని 27 వేల ఆశావర్కర్లు, 8 వేల మంది ఏఎన్ఎంల సేవలను ఈ సర్వే కోసం వినియోగించుకోనున్నారు. మరోవైపు నేటి నుంచి గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. ఇప్పటికే అత్యవసరం కానీ ఆపరేషన్లు నిలిపివేశారు. అలాగే లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించా.