ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మండిపడుతూ రాహుల్ ట్వీట్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ బుధవారం ఇచ్చిన ట్వీట్లో దేశాన్ని అమ్ముతున్నవాళ్లు క్రోనీ జీవులని రాహుల్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను, బ్యాంకులను అమ్ముతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంటులో చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ సోమవారం మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలను ప్రోత్సహిస్తున్నవారిపై మండిపడ్డారు. ఇటువంటి ఆందోళనలు నిర్వహిస్తున్నవారిని కొత్త జాతికి చెందిన ఆందోళనకారులుగా, ‘ఆందోళన జీవులు’గా అభివర్ణించారు.
వీరు ఆందోళనలు చేయకుండా బతకలేరని, ఇటువంటివారి నుంచి మన దేశం రక్షణ పొందాలని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను క్లుప్తంగా ఎఫ్డీఐ అని చెప్పడం పరిపాటి. దీనికి కొత్త అర్థాన్ని మోదీ ఇచ్చారు. మన దేశంలో కొత్త రకం ఎఫ్డీఐ తయారైందని వ్యంగ్యంగా అన్నారు. ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ (విదేశీ విధ్వంసక భావజాలం) తయారైందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలతోపాటు రైతులు కూడా మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పదజాలాన్ని ఉపయోగించడం తమను అవమానించడమేనని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ బుధవారం ఇచ్చిన ట్వీట్లో ‘దేశాన్ని అమ్ముతున్నవారు క్రోనీ జీవులు‘ అంటూ మండిపడ్డారు.
పీఎస్యూ-పీఎస్బీ-సేల్ అనే హ్యాష్ట్యాగ్ పెట్టారు. క్రోనీ అంటే మంచి మిత్రుడు, సన్నిహిత మిత్రుడు అని అర్థం. కొన్నిసార్లు ఈ పదాన్ని వ్యతిరేకార్థంలో కూడా వాడతారు. అర్హత లేని మిత్రునికి ఉద్యోగం ఇవ్వడం లేదా పదోన్నతి కల్పించడం అనే అర్థంలో కూడా క్రోనీని వాడతారు