- కొరోనా నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే
- అంతర్జాతీయ అంటువ్యాధి సన్నాహక దినోత్సవం
- ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి పలు సూచనలు
న్యూయార్క్, డిసెంబర్28: కొరోనా వైరస్ మహమ్మారి నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరాన్ని నొక్కిచెప్తూ భవిష్యత్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి సంసిద్ధతలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తున్నది. కొరోనా వైరస్ మహమ్మారే చివరిది అని అనుకోవద్దని, భవిష్యత్లో మరిన్ని మహమ్మారులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. భవిష్యత్లో ఎదురయ్యే అన్నిరకాల మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాలని ఐరాస పిలుపునిచ్చింది. మొదటి అంతర్జాతీయ అంటువ్యాధి సన్నాహక దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు పలు సూచనలు చేసింది. కొరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో కొత్త రకాల వైరస్, బ్యాక్టీరియాలపై ఫోకస్ పెరిగింది.
ఇలాంటి కొత్త వైరస్, బ్యాక్టీరియాలు భవిష్యత్తులో పుట్టుకొస్తాయా ? అనే దానిపై అధ్యయనాలు పెరిగాయి. అంతర్జాతీయ అంటువ్యాధి సన్నాహక దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు మానవాళిపై దండెత్తిన అంటువ్యాధుల గుర్తించి తెలుసుకుందామని తెలిపింది.
మన పూర్వీకులు ఎదుర్కొన్న అంటురోగాల్లో కొన్ని ఇప్పటికీ మనతోనే ఉన్నాయన్నది వాస్తవం. కాలక్రమంలో ప్రపంచ దేశాలను భయపెట్టిన కొన్ని అంటువ్యాధులు అంతరించిపోయాయి. చరిత్రలో మూడుసార్లు తీవ్ర వినాశనాన్ని సృష్టించిన ఈ అంటువ్యాధి మొట్టమొదటసారిగా క్రీస్తు శకం 541లో వ్యాపించింది. ఇది వైరస్ వల్ల కాకుండా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎలుకల ద ఉండే చిన్న చిన్న పురుగులు, ఈగల ద్వారా మనుషులకు వ్యాధి సంక్రమిస్తుంది. మనుషుల్లో తుమ్ము, దగ్గు తుంపర్ల ద్వారా ఒకరినుంచీ ఒకరికి సోకుతుంది. 2,000 సంవత్సరాల కాలంలో ఈ ప్లేగు బారిన పడి లక్షల్లో జనం మరణించారు.
ఇప్పటివరకూ చరిత్రలో నమోదైన అత్యంత ప్రాణాంతకమైన మహమ్మారి ఇదే.మశూచి లేదా స్మాల్ఫాక్స్ గా పిలిచే ఈ వ్యాధిని తొలుత 1520లో గుర్తించారు. వరియోలా మైనర్ అనే వైరస్ ద్వారా వ్యాపించే ఈ వ్యాధి ప్రాణాంతకమైనది. శరీరంపై నీటితో నిండిన పొక్కులు ఏర్పడతాయి. 10 మందిలో ముగ్గురు ఈ అంటురోగం బారిన పడి చనిపోయేవారు. ఈ వ్యాధి తుమ్ము, దగ్గులతో పాటూ నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా లేదా శరీరంపై ఏర్పడే పుండ్ల ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఒక్క 20వ శతాబ్దంలోనే మశూచి బారిన పడి 30 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్కు చెందిన డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నెర్ 1796లో తయారుచేసిన వ్యాక్సిన్తో ఈ వ్యాధి పూర్తిగా తొలగిపోయింది. ఇక కలరా విషయానికొస్తే.. మశూచీ మాదిరిగానే పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలితీసుకున్నది. ఈ వ్యాధి 1817లో కలిషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అందించిన సమాచారం మేరకు.. ఏడుసార్లు వ్యాపించిన ఈ వ్యాధి వల్ల కొన్ని లక్షలమంది మరణించారు. రుతువుల మార్పుతో వచ్చే ఫ్లూ జ్వరాలు కూడా అంటువ్యాధులే. ఇప్పటివరకు ఇన్ఫ్లూయెంజా అనేకసార్లు వ్యాప్తిచెందింది. తొలుత 1918లో వచ్చినప్పుడు 5-10 కోట్ల మంది జనం చనిపోయారు. హెచ్1ఎన్1 వైరస్ ద్వారా వ్యాపించే ఈ ఫ్లూ, 20వ శతాబ్దం ప్రారంభంల్లో పెద్ద మహమ్మారిగా విస్తరించింది. ప్రస్తుతం కొవిడ్-19 మాదిరిగానే విడిగా ఉండటం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. హాంకాంగ్ ఫ్లూ కూడా లక్షల్లో జనాన్ని పొట్టనపెట్టుకున్నది. స్వైన్ ఫ్లూ కూడా మరో రకం వైరస్. 2009లో ప్రపంచ జనాభాలో 21 శాతం మంది ఈ వైరస్ బారినపడ్డారని గణాంకాలు చెప్తున్నాయి. మరో భయంకరమైన అంటువ్యాధి హెచ్ఐవీ, ఎయిడ్స్.. తొలుత 1981 లో గుర్తించారు. భయంకరమైన హెచ్ఐవీ వైరస్ మానవ రోగనిరోధక శక్తిపై దాడి చేసి చంపేస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా జనం ఈ వ్యాధి వల్ల చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచానా వేసింది. ఇప్పటికీ ఎయిడ్స్, హెచ్ఐవీకి మందులుగానీ ఇతర చికిత్స విధానాలుగానీ అందుబాటులోకి రాలేదు.
కేవలం వ్యాధి నివారణకు అవగాహనతోనే ప్రజలు ఈ వ్యాధి బారిన పడకుండా చూస్తున్నారు. కొవిడ్ 19 వ్యాప్తిలోకి రాకముందు ఇదే మాదిరి సార్స్, మెర్స్ వైరస్లను ప్రపంచం చూసింది. 2003 లో ఈ వ్యాధి ప్రపంచ దేశాలను భయపెట్టింది. తక్కువ సంఖ్యలో జనం ప్రాణాలను తీసుకున్న ఈ వైరస్.. 2003 చివర్లో అదృష్యమైంది. ఇదే క్రమంలోనే మాంసం తినే బ్యాక్టీరయా వల్ల అంటువ్యాధులు కలిగే ప్రమాదంతో పాటు కొరోనా వైరస్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. వండని మాంసం తినడం ద్వారా ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశాలెక్కువ అని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవం సందర్భంగా రానున్న రోజుల్లో మరిన్ని మహమ్మారులు మనపై దండయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సన్నద్ధం కావాలని ఐరాస కార్యదర్శి జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఒక సందేశంలో సూచించారు. అంటువ్యాధుల ప్రతిస్పందనలను సమన్వయం చేయడంలో, అంటువ్యాధుల ప్రభావాలను నివారించ డానికి, తగ్గించడానికి, పరిష్కరించడానికి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో డబ్ల్యూహెచ్ఓ పాత్రను జనరల్ అసెంబ్లీ అభినందించింది.