- భారీగా పెరుగుతున్న కొరోనా రోజువారీ కొత్త కేసులు
- 1,892కు చేరిన ఒమిక్రాన్ కేసులు
- దిల్లీ, మహారాష్ట్రల్లో అత్యధికంగా నమోదు
- అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యాధికారులు
- 50 శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..
- గర్భిణులు, దివ్యాంగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశం
న్యూ దిల్లీ, జనవరి 4 : దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కొరోనా కలకలం రేపుతుంది. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 578, ఢిల్లీలో 382 ఒమిక్రాన్ బాధితులు ఉన్నారు. కేరళలో 185, రాజస్థాన్ 174, గుజరాత్ లో 152 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 1,892 ఒమిక్రాన్ కేసులు నమోదు అయితే.. అందులో 799 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. కొరోనా థర్డ్వేవ్ ముంచుకొస్తున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా తాజాగా 24 గంటల్లో 37,379 కొరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 124 మంది కొరోనాతో చనిపోయారు. రోజువారీ పాజిటివ్ రేటు పెరిగి 3.24 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,007 మంది కొరోనా నుంచి కోలుకున్నారు. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. మరోవైపు వ్యాక్సినేషన్ పక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్రం. సోమవారం నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ మొదలైంది. 15 నుంచి 18 ఏళ్ల వారికి టీకా వేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే దాదాపు 40లక్షల మందికి పైగా టీనేజర్లకు వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. వారు వీరు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కొరోనా బారిన పడుతున్నారు.
కొరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తుంది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒక్క రోజే పంజాబ్ పటియాల మెడికల్ కాలేజీలో 100 మంది వైద్య విద్యార్థులకు కొరోనా సోకడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమయ్యి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కొరోనా బారిన పడ్డారు. ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్లోని 26 మంది వైద్యులు కొరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.5 శాతంగా ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎల్లో అలర్ట్ను అమలు చేస్తున్నారు. కేరళలో కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. మొదటి రెండు వేవ్లు ఢిల్లీ, ముంబైలో అత్యధికంగా ఉంటే, ఇప్పుడు ఈ రెండు నగరాలతో పాటు దేశంలోని మిగతా మెట్రోపాలిటన్ నగరాలు, ద్వితీయశ్రేణి నగరాల్లో సైతం కొరోనా కేసులు పెరుగుతున్నాయి. మాస్క్ తప్పనిసరి చేసినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలానే కేసులు పెరిగితే దేశంలో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితులు రావొచ్చు. కాగా భారత్లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3,49,60,261కి చేరింది. ఇప్పటి వరకు నమోదైన కొరోనా మరణాల సంఖ్య 4,82,017కి పెరిగింది. కొరోనా మహమ్మారి నుంచి 3,43,06,414 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకు దేశంలో 1,46,70,18, 464 కొరోనా టీకా డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
50 శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్…గర్భిణులు, దివ్యాంగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశం
దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయాలకు రావడంపై మినహాయింపు ఇచ్చింది. అదే సమయంలో సిబ్బంది ఆఫీస్కు వచ్చేందుకు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు రెండు సమయాలను నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు వొచ్చినవారు సాయంత్రం 5.30 గంటలకు, పొద్దున పదింటికి వొచ్చినవారు సాయంత్రం 6.30 గంటలకు వెళ్లాలని ఆదేశించింది. రాకపోకల సమయంలో రద్దీని నివారించేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు కేంద్రం పేర్కొంది. కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో ఉండేవారు కూడా ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అండర్ సెక్రటరీ, అంతకంటే ఎక్కువ ర్యాంకుల్లో ఉన్న అధికారులు కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని పేర్కొంది. కార్యాలయాల్లో జరిగే సమావేశాలను వీలైనంత మేరకు వీడియో సమావేశం విధానంలో నిర్వహించాలని సూచించింది. ఆఫీసులకు వొచ్చే సందర్శకులతో భేటీ అవడం అత్యవసరం, తప్పనిసరి అయితే తప్ప విరమించుకోవాలని తెలిపింది. మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం సహా కార్యాలయాల్లో కొరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలయ్యేలా అధికారులు అంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.