- తాజాగా 90,928 మందికి పాజిటివ్..కొరోనాతో 325 మంది మృతి
- 2,630కి చేరిన ఒమిక్రాన్ కేసులు
- వివరాలు వెల్లడించిన వైద్యారోగ్యశాఖ
- ముంబైలో 220 మంది వైద్యులకు కొరోనా
- మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ఫ్రమ్ హోమ్…ఐటి సంస్థల నిర్ణయం
- కొరోనా టాబ్లెట్తో ఎముకలు దెబ్బతింటాయి : ఐసీఎంఆర్ చీఫ్ హెచ్చరిక
న్యూ దిల్లీ, జనవరి 6 : దేశంలో కొరోనా థర్డ్వేవ్ వొచ్చిందన్న హెచ్చరికల నేపథ్యంలో…అందుకు తగ్గట్లుగానే రోజువారీ కొరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు ఆదే స్థాయిలో పెరుతుండడం సర్వత్రా ఆంధోళన కలిగిస్తువది. బుధవారం 50 వేలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం నాటికి 90 వేలుకు పైగా చేరుకుంది. ఒక్కరోజులోనే 90వేలకు పైగా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం కంటే 56 శాతం అధికంగా 90,928 మందికి కొరోనా పాజిటివ్గా తేలింది. మొత్తం కేసులు 3.51 కోట్లకు చేరాయి. గతేడాది జూన్ నెలలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 26 వేలు, పశ్చిమ్ బెంగాల్లో 14 వేలు, ఢిల్లీలో 10 వేలకుపైగా కేసులు వొచ్చాయి. ఇదే సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 2,630కి చేరాయి.
బుధవారం కొత్తగా 495 మందికి ఈ వేరియంట్ సోకింది. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 797 మందికి ఈ కొత్త వేరియంట్ సోకగా, ఢిల్లీలో ఆ సంఖ్య 465కి పెరిగింది. యాక్టివిటీ రేటు 0.81 శాతానికి పెరిగింది. పాజిటివిటీ రేటు 3.47 శాతం కాగా, రికవరీ రేటు 97.81 శాతానికి తగ్గిపోయింది. మొత్తం రికవరీలు 3.43 కోట్లకు చేరాయి. అలాగే 24 గంటల్లో 325 మంది కొరోనాతో మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 4,82,876కి చేరింది. బుధవారం రాజస్తాన్కి చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్తో మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది.
ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 797 కాగా, ఢిల్లీలో 465, రాజస్థాన్లో 236, కేరళలో 234, కర్ణాటకలో 226, గుజరాత్లో 204, తమిళనాడులో 121 కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో 94 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా.. ఆంధప్రదేశ్లో 28 కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్, చత్తీస్గఢ్తో పాటు ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగలాండ్, మిజోరాం, త్రిపురలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదుకాలేదు. అధికారిక సమాచారం మేరకు దేశంలో ఇప్పటి వరకు 995 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.
ముంబైలో 220 మంది వైద్యులకు కొరోనా
ముంబై నగరంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో 220 మంది రెసిడెంట్ వైద్యులకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కెఇఎమ్) హాస్పిటల్లో 60 మంది రెసిడెంట్ వైద్యులు, లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్లో 80 మంది, ఆర్ఎన్ కూపర్ హాస్పిటల్లో ఏడుగురు వైద్యులు కొరోనా బారిన పడ్డారని డాక్టర్ల సంఘం ప్రతినిధి తెలిపారు. ఈ మూడు హాస్పిటళ్లను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్వహిస్తుంది. పొరుగున ఉన్న థానే నగరంలో మున్సిపాలిటీ నిర్వహణలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ హాస్పిటల్లో ఎనిమిది మంది రెసిడెంట్ వైద్యులకు పాజిటివ్ అని వెల్లడైంది. ముంబైలో కొరోనా కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ఫ్రమ్ హోమ్…ఐటి సంస్థల నిర్ణయం
దేశంలో ఒమిక్రాన్ కారణంగా కొరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు మళ్లీ ఇంటి నుంచే పనిచేయాలని ఆయా ఐటి సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. సోమవారం నుంచే కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయటం ప్రారంభించగా, బుధవారం నుంచి మరికొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇదే విధంగా సూచించినట్లు తెలుస్తుంది. ఐటీనే కాకుండా దేశంలోని ఇతర రంగాలకు చెందిన పలు సంస్థలు కూడా ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని ఇస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన పలు వ్యాపార సంస్థలు కూడా తాజా పరిణామాల దృష్ట్యా తమకు అనువైన చర్యలను తీసుకుంటున్నాయి.
కొరోనా టాబ్లెట్తో ఎముకలు దెబ్బతింటాయి : ఐసీఎంఆర్ చీఫ్ హెచ్చరిక
కొరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్న వేళ ఇటీవల దేశంలో కొరోనా టాబ్లెట్ మోల్నుపిరవిర్ అందుబాటులోకి వొచ్చింది. అయితే ఈ టాబ్లెట్తో ముప్పు పొంచి ఉందని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మాత్రలు వాడితే శరీరంలో ఎముకలు, కండరాలు దెబ్బతినే అవకాశముందని ఆయన తెలిపారు. మోల్నుపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్తో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తామని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ టాబ్లెట్ మాత్రలను కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ..కొరోనా చికిత్స మార్గదర్శకాల్లో చేర్చలేదని ఐసీఎంఆర్ చీఫ్ వివరించారు. కాగా మోల్నుపిరవిర్ కొరోనా టాబ్లెట్ను మన దేశంలో 13 ఫార్మా కంపెనీలు తయారుచేస్తున్నాయి. మ్యాన్కైండ్ ఫార్మా, సన్ ఫార్మా, డా.రెడ్డీస్, హెటిరో సహా ఇతర సంస్థలు ఈ మాత్రలను తయారు చేసేందుకు అనుమతి పొందాయి.