- హుజూరాబాద్ ఎన్నిక కోసమే అన్న ఆరోపణల్లో నిజం లేదు
- రాష్ట్ర ఏర్పాటుకు ముందే దళిత ఉద్దరణపై చర్చలు
- రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తితో వారి ఉద్దరణ
- వందశాతం సబ్సిడీతో వ్యాపారాలు చేసుకునే అవకాశం
- గతంలో దళిత ఉద్దరణకు తీసుకున్న చర్యలు ఫలించలేదు
- అంబేడ్కర్ స్ఫూర్తితోనే రాష్ట్ర ఏర్పాటు
- తెలంగాణ ఇప్పుడు వ్వయసాయికంగా బలంగా మారింది
- ఎక్కడ చూసినా పచ్చని పొలాలు
- అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చపై సిఎం సుదీర్ఘ వివరణ
దళితబంధు అమలును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని..దళితుల అభ్యున్నతి లక్ష్యంగా పథకాన్ని కొనసాగిస్తామని సిఎం కెసిఆర్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ఎంతగా కష్టించామో అంతే స్ఫూర్తితో దళిత ఉద్దరణకు పాటుపడతామన్నారు. దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే అన్న వాదనల్లో పసలేదన్నారు. దీనికోసం తెలంగాణ ఏర్పడక ముందునుంచే చర్చోపచర్చలు చేశామని అన్నారు. అలాగే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సిద్దిపేటలో కొంత అమలుకు ప్రయత్నాలు చేశామన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు దయనీయ స్థితిలో ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తరతరాలుగా సామాజిక వివక్షకు గురైన జాతి దళిత జాతి అని, 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత సైతం దళితుల జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. స్వాతంత్యాన్రికి ముందు కూడా దళిత జాతి హింసకు గురైందన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ ఉజ్వలమైన పాత్ర పోషించారని, క్రమంగా అంబేద్కర్ ఆలోచనా సరళి బయటకు వొస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడింది కూడా అంబేద్కర్ పుణ్యమే అని గతంలో చెప్పానన్నారు. మంగళవారం దళితబంధు పథకంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులతో పాటు అన్ని వర్గాల్లో అణగారి ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్కు ఉండాలని అంబేద్కర్ చెప్పారని, అంబేద్కర్ అనేక పోరాటాలు సాగించారన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు సాధికారత చేకూరలేదని, గత ప్రభుత్వాలు కొంత చేశాయి..ఎంత మార్పు వొచ్చిందన్నారు. దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించ లేదని, అనేక పార్టీలు పాలించాయన్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక భిన్నమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వొచ్చాయని.. అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారని చెప్పారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెబుతున్నారని, 75లక్షల మంది దళితులు ఉంటే 13లక్షల భూములే ఉన్నాయన్నారు. నినాదాలు వచ్చాయి.. కానీ గణనీయమైన మార్పు రాలేదన్నారు. రాబోయే మార్చిలోపు ప్రతి నియోజకవర్గంలో కొంత మేర దళితబంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పథకంపై అనేక విషయాలను వెల్లడించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఎంపిక చేసిన మరో నాలుగు మండలాల్లోని మొత్తం దళిత కుటుంబాలకు దళితబంధు పథకం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు వొచ్చే మార్చిలోపు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేసి వారికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. వొచ్చే మార్చిలోపు వివిధ నియోజకవర్గాల్లో అమలు చేయబోయే దళితబంధు పథకం విషయంలో ఎమ్మెల్యేలే కీలక భూమిక పోషిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. వాళ్లే లబ్దిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు. ఇలా చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు కూడా ఈ పథకం అమలుకు సంబంధించి అనుభవం వొస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ తరువాత వొచ్చే ఏడాది బ్జడెట్లో ఈ పథకం కోసం రూ. 20,000 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది లబ్దిదారులకు ఈ పథకం అమలు చేసుకుంటామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది లబ్దిదారులకు దళితబంధు ఇవ్వొచ్చని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అప్పుడు ఎక్కువ గ్రామాలు తీసుకోవడంతో పాటు అనేక మండలాలను కవర్ చేసుకుంటామని అన్నారు. ఈ పథకం అమలులో ఎలాంటి నిబంధనలు ఉండవని అన్నారు. వేరే కులస్థుల దగ్గర రూ. 10 లక్షలు ఉంటే వాళ్లు ఏ విధంగా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటారో.. దళితబంధు పథకం తీసుకున్న వాళ్లు కూడా అదే విధంగా వ్యాపారం చేసుకోవచ్చని అన్నారు. వాళ్లు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని..కేవలం లెక్క కోసమే వారి నుంచి చిప్ ద్వారా సమాచారం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకం అందిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.
తన ఫోటో పెట్టుకున్నవారికే ఈ పథకం ఇస్తామని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాజకీయ పార్టీలు వేరైనంత మాత్రాన ఈ పథకం రాకుండా ఉండదని తెలిపారు. దళితబంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదని..1986లోనే ఈ పథకం పురుడు పోసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇప్పటివరకు కొంతమేర చేయగలిగామని కేసీఆర్ వివరించారు. ‘ఎస్సీ కార్పొరేషన్ను ఇందిరా గాంధీ కాలంలో ఏర్పాటు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం పొంది బాగుపడిన వారు కనిపించలేదు. వొచ్చే ఏడాది మార్చి లోపు 100 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం అమలుకు ఇప్పుడు దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తాం. రూ.10 లక్షలతో ఎక్కడైనా, ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చు. నిధులతో పలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం చేయదు. లబ్దిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టొచ్చు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే. వొచ్చే బ్జడెట్లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తాం. వొచ్చే బడ్జెట్ నిధులతో నియోజకవర్గానికి 2వేల మందికి దళిత బంధు అందజేస్తాం. దళితుల కోసం రక్షణ నిధి కూడా ఏర్పాటు చేస్తాం. ఒక్క హుజూరాబాద్ ఎన్నిక కోసం అబద్దాలు అడతామా? సందేహం లేదు.. మళ్లీ మేమే అధికారంలోకి వొస్తాం. హైదరాబాద్ మినహా ప్రతి జిల్లాలో దాదాపు 20 శాతం ఎస్సీలు ఉన్నారు. రాష్ట్రంలో సగటున 17.53 శాతం ఎస్సీల జనాభా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ పెంచాలి. కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందే. ఇందుకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం‘ అని కేసీఆర్ పేర్కొన్నారు.
మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెబుతున్నారు. 75 లక్షల మంది దళితులుంటే.. 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది. పాలమూరు లాంటి జిల్లా నుంచి లక్ష మంది వలస వెళ్లారు. తెలంగాణ ఏర్పాటును విఫల ప్రయత్నమని చెప్పే ప్రయత్నాలు జరిగాయని సీఎం అన్నారు. పాలమూరు వంటి జిల్లా నుంచి లక్షల మంది వలసలు వెళ్లారని..తెలంగాణ ఏర్పాటును విఫల ప్రయత్నమని చెప్పే ప్రయత్నాలు జరిగాయన్నారు. బాలారిష్టాల్ని అధిగమించుకుంటూ సంక్షేమం కోసం పాటుపడ్డామన్నారు. ఆసరా పింఛన్లు పెంచామని.. వికలాంగుల పింఛను రూ.3వేలకు పెంచినట్లు చెప్పారు. తెలంగాణలో 3కోట్ల టన్నుల వరిధాన్యం పండుతుందని, వ్యవసాయ రంగ స్థిరీకరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పచ్చదనం కనిపిస్తుందని, రాష్ట్రంలో పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని.. ప్రకృతి సైతం సహకరిస్తుందని చెప్పారు. విభజనకు ముందు ఏపీలో ఎకరం అమ్మినా తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనే పరిస్థితి లేదని.. వ్యవసాయంలో రాష్ట్రం నెంబర్ వన్గా నిలిచిందన్నారు. ఇప్పుడు ఒక ఎకరం తెలంగాణలో అమ్మి.. ఆరు ఎకరాలు ప్రకాశం జిల్లాలో కొనే పరిస్థితి ఉందన్నారు. ఉచిత విద్యుత్తో రైతులకు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో కోటి 29 లక్షల ఎకరాలు సాగవుతుందని.. యాసంగిలో 65 లక్షల ఎకరాలు సాగులో ఉందని వివరించారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేశామని, నీటి తీరువా పన్నే లేదన్నారు. ఉచిత నీరు, విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 26 లక్షల టన్నుల ఎరువులు వినియోగిస్తున్నామని, గతంలో 8 లక్షల ఎరువులు మాత్రమే వినియోగించారన్నారు.