ఆ మంత్రి గెలుపు అంత ట్రాషేనా?
ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లో దొంగల హల్చల్..?
కీలక పత్రాలు, వీడియో ఫుటేజ్ మాయం..?
ఆ కీలక అధికారి కనుసన్నల్లోనే అంతా జరిగిందా..?
14వ రౌండ్ ఫలితాల తారుమారులో గోల్మాల్ నిజమేనా..?
జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లో దొంగలు పడ్డారా..? 14వ రౌండులో గెలుపును తారుమారు చేసిన ఆ అధికారి తాళం చెవుల మిస్సింగ్తో పాటు వీడియో ఫుటేజ్, బాక్స్ల తాళాల మాయ వెనుక అంతా తానై కథ నడిపించాడా..? అంటే అవుననే అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. కండువా కప్పుకోకుండా అధికార పార్టీ కార్యకర్తగా పనిచేసిన ఆ ఉన్నత స్థాయి అధికారి ధర్మపురి ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాడా అంటే.. అన్ని వేళ్ళు అతని వైపే చూస్తున్నాయి. ధర్మపురి ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన జగిత్యాల జిల్లాలోని నూకపల్లి వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ తాళాలు హైకోర్ట్ ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల అధికారి ప్రిన్స్పల్ సెక్రెటరి అవినాష్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష అధ్వర్యంలో పగలగొట్టి గదుల తలుపులు తెరిచారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టే సమయంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఉండాలని సమాచారం ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్డూరి లక్ష్మన్ కుమార్ హాజరవగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతినిధిగా బాధినేని రాజేందర్ సమక్షంలో తాళాలు పగలగొట్టారు.
ఈవీయంలు భద్రపరచిన గదులు తెరిచాక అందులో ఉన్న 20 ట్రంక్ పెట్టెలో 16 పెట్టె అసలు తాళాలే లేవని అధికారులు గుర్తించారు. ఉన్న 4 ట్రంకు పెట్టెల తాళం చెవులు అధికారుల వద్ద లేక పోవడంతో వాటిని కూడా పగలగొట్టి తీశారు. ధర్మపురి నియోజక వర్గంలో 268 పోలింగ్ బూత్లకు సంబంధించిన 17ఏ, 17సి డాక్యుమెంట్లను పరిశీలించి, పోలింగ్ బూత్ల వారిగా పాలైన వోట్ల వివరాలు నమోదు చేస్తున్నారు. కోర్టుకు అందజేసేందుకు ప్రతులను జిరాక్స్ కాపీలు తీసారు. ప్రతి పోలింగ్ బూత్ వారిగా రెండు డాక్యుమెంట్లను స్కాన్ చేస్తున్నారు. స్ట్రాంగ్ రూము వద్ద జరిగే ప్రతి పక్రియ వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేసి ఈ నెల 26 న హైకోర్ట్కు సమర్పించనున్నారు. ఈ పక్రియలో సాయంత్రం 6 గంటల వరకు 120 పోలింగ్ బూత్ల 17ఏ, 17 సి పత్రాలను నమోద్ చేశారు. ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు అధికారులు సమాచారం సేకరించే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. అధికారులు రికార్డ్ చేసిన విడియో పుటేజి, స్కాన్, జిరాక్స్ చేసిన డాకుమెంట్లను జిల్లా కలెక్టర్ హైకోర్ట్కు సమర్పించనున్నారు.
కేంద్ర ఎన్నికల అధికారి వొస్తే తప్ప, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ తాళాలు పోయిన విషయం చెప్పలేదు. నాలుగు సంవత్సరాల క్రితం తాళాలు పోయిన విషయంపై సీఎస్ కాని, సీఎం గానీ క్యాబినెట్ మంత్రి ఈశ్వర్ కూడా చెప్పలేకపోయారు అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. అయినప్పటికీ న్యాయం చాలా గొప్పది. హైకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ఎన్నికల అధికారి ప్రిన్సిపల్ సెక్రెటరీ అవినాష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివరాలను నమోదు చేస్తున్నారు. తర్వాత కోర్టుకు అందజేశాక నేను చేసే న్యాయపోరాటంలో నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను అని లక్ష్మణ్ కుమార్ అన్నారు. స్ట్రాంగ్ రూమ్ లోపల ట్రంకు పెట్టెలకు కూడా తాళాలు లేకపోవడం, 20 ట్రంకు పెట్టెలకుగాను నాలుగు ట్రంకు పెట్టెలకు మాత్రమే తాళాలు పెట్టి ఉన్నాయి. వాటిని కూడా పగలగొట్టి తెరిచారు. 17 సి పత్రాలు అవసరం కాబట్టి ఆ తాళాలు పగలగొట్టి తీయడంలో నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయ లేదు. 13 రౌండ్ వరకు నాకు 3200 మెజార్జీ రాగా 14 రౌండ్లో 441 లతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందారని ప్రకటించడంతో దీనిపై నేను అభ్యంతరం చెప్పాను. దీనిని ఆమోదించడం లేదని కేంద్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నాను. అందుకు సంబంధించిన వీడియో పుటేజి కూడా ఉన్నాయి.
నేను 14వ రౌండును రీ కౌంటింగ్ చేయాలని కూడా ఫిర్యాదు చేశాను. ఇప్పుడు లెక్కింపు చేసేందుకు సిద్ధంగా లేమని అధికారులు అప్పుడు దాటవేశారని లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. 14వ రౌండ్ వి.వి. ప్యాట్ స్లిప్లు లెక్కించాలని నేను మాట్లాడిన మాటల వీడియో రికార్డింగ్లు ఉన్నాయి. కోర్టుకు వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి ఎన్నికల విభాగానికి సంబంధించిన ఎపిసోడ్ మొత్తానికి కర్త, కర్మ, క్రియగా అసాంతం వ్యవహరించిన ఆ కీలక అధికారి బాగోతం బట్టబయలు అవుతుందా?.. లేదా తాను చాకచక్యంగా వ్యవహరించి పలు కీలక పత్రాలు, సిసి ఫుటేజ్ మాయం చేయడంతో సాక్షాలు దొరకనీయకుండా చేసి నిర్దోషిగా బయటపడతారా అనేది వేచి చూడాల్సిందే..! ఖద్దర్ బట్టలు వేసుకోవడానికి కాచుకొని చూస్తున్న ఆ సివిల్ సర్వీసెస్ అధికారి అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ సాచి సాగిదండాలు పడుతున్న వైనంపై ఇదివరకే రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.