తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శమే…
30 శాతం జాతీయ అవార్డులు తెలంగాణకే
కెసిఆర్ పాలనతోనే సాధ్యమయ్యింది
సిరిసిల్ల ప్లీనరీ సమావేశంలో మంత్రి కెటిఆర్
సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకరు మెదడు లేని బంటి..ఇంకొకరు పార్టీలు మారే చంటి..వాళ్లా ప్రతిపక్షమని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని చెప్పారు. దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వొచ్చాయని వెల్లడించారు. ఇదంతా సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే
సాధ్యమైందన్నారు.
మంగళవారం సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..60 లక్షల మంది గులాబీ దండుకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. 22 ఏండ్ల క్రితం హైదరాబాద్ జలదృశ్యంలో టీఆర్ఎస్గా పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ రూపాంతరం చెందిందని, మారింది టీఆర్ఎస్ పేరు మాత్రమేనని.. జెండా, గుర్తు, డీఎన్ఏ మారలేదన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని చెప్పారు. దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వొచ్చాయని వెల్లడించారు. ఇదంతా సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమైందన్నారు.
జిల్లాలోని గంభీరావుపేటకు జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు వొచ్చిందని చెప్పారు. గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ను వేదికపైకి పిలిచి అభినందించారు. ఇది గోల్మాల్ గుజరాత్ కాదు.. గోల్డెన్ తెలంగాణ అని చెప్పారు. దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్ఎస్గా రూపాంతరం చెందామని వెల్లడించారు. మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ మూడు సభలు పెడితే లక్షల మంది వచ్చారని తెలిపారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ నినదించారని చెప్పారు. రాష్ట్రంలో గత తొమ్మిదేండ్లలో వ్యవసాయానికి రూ.4.5 లక్షల కోట్లు ఖర్చుపెట్టామన్నారు. 2018లో ప్రతి కార్యకర్త తానే అభ్యర్థినన్నట్టు పనిచేశారని, సిరిసిల్లలో తనను 89 వేల మెజార్టీతో గెలిపించారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆదమరిస్తే పచ్చని పందిరిలో పాము జొర్రిందని బీజేపీని ఉద్దేశించి అన్నారు. సిరిసిల్లలో రూ.400 కోట్లతో అపారెల్ పార్కును నిర్మిస్తున్నామన్నారు. ఈ పార్కులో వర్కర్ టూ ఓనర్ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్లలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, డిగ్రీ కాలేజీ, మెడికల్ కాలేజీ, అద్భుతంగా రహదారులు, బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.