- కొరోనాతోనే సంక్షోభం ముగియ లేదు
- ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి
- సంసిద్ధంగా ఉండాలన్న డబ్ల్యూహెచ్ఓ
కొరోనా వైరస్ మహమ్మారి లాంటి మరిన్ని సంక్షోభాలు ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో హెచ్చరిక జారీ చేసింది. కొరోనాతోనే సంక్షోభం సమసి పోయిందనుకోరాదని సూచించింది. కోవిడ్ ధాటికి ప్రపంచదేశాలు సంక్షోభంలోకి వెళ్లడంతో ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు కృషి చేస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక జారీ చేసింది. లక్షలమంది ప్రాణాలు తీసుకుంటున్న మహమ్మారి, ఇదే చివరిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ హెచ్చరించారు. ’వైరస్ ఉత్పాతాలు, మహమ్మారి విజృంభణలు నిజజీవితంలో తప్పవని చరిత్ర స్పష్టం చేస్తోంది. రాబోయే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత సంసిద్ధంగా ఉండాలి. ఇందులో భాగంగా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు. స్పానిష్ ఫ్లూ మొదలుకొని సార్స్, మెర్స్, ఎబోలా, స్వైన్ఫ్లూ వంటి ఎన్నో వైరస్లు విజృంభిస్తూ మానవాళికి సవాల్ విసురుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కేవలం కొరోనా వైరస్తోనే ఈ ప్రమాదం ముగిసిపోలేదని, రానున్న రోజుల్లో మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు అప్రమత్తంగా, మరింత సన్నద్ధతతో ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇదిలా ఉంటే, కేవలం ఏ ఒక్కదేశమో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టినంత మాత్రాన మహమ్మారిని అరికట్టలేమని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. దేశాలన్నీ అనుసంధానమై ఉన్న ప్రపంచంలో, స్వల్ప ఆదాయ దేశాల ప్రజలకు వ్యాక్సిన్ అందకపోతే అది మరింత విస్తరించే ప్రమాదం ఉంటుందని తేల్చిచెప్పింది. అందుకే, ప్రతిదేశానికీ వ్యాక్సిన్ అందించడం ఎంతో కీలకమని అభిప్రాయపడింది. అందుకోసం కొరోనా వ్యాక్సిన్ను అన్ని దేశాలకు సమానంగా అందేలా ‘కొవ్యాక్స్’ కార్యక్రమాన్ని చేపట్టింది. తద్వారా టీకా తయారుచేసుకోలేని, కొనలేని దాదాపు 100 దిగువ, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భారత్ను భాగస్వామిగా చేర్చుకునేందుకు డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే చర్చలు జరుపుతోంది. ఈ కార్యక్రమంలో చేరమని అమెరికా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.