- వచ్చే ఏడాది భారత్లో అందుబాటులోకి వ్యాక్సిన్
- రాజ్యసభలో చర్చ సందర్భంగా మంత్రి హర్షవర్ధన్
ప్రజల బాధ్యతా రాహిత్యంతోనే కొరోనా వైరస్ వ్యాప్తి జరుగుతోందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా సాగడం వల్లనే వ్యాప్తి తీవ్రంగా ఉందన్నారు. వైరస్ తగ్గిందన్న భ్రమలో ఉన్న ప్రజలు తగు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. గురువారం రాజ్యసభలో కొరోనాపై చర్చ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మూడు వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఏడాది భారత్లో ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. దేశంలో అన్లాక్ నాటి నుంచి ప్రజలు వైరస్ తగ్గిందని, మాస్క్లు ధరించాల్సిన అవసరం లేదని భావించారన్నారు. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతోందన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు మాస్క్, భౌతిక దూరమే సామాజిక టీకాలని అన్నారు. కొవిడ్ పరీక్షల్లో త్వరలోనే అమెరికాను దాటనున్నట్లు తెలిపారు. వలస కార్మికులు కొంతకాలంగా సమస్యలను ఎదుర్కొన్నారని, అయితే వారికి సహాయమందించేందుకు కేంద్ర •ంశాఖ, రైల్వేలు గణనీయమైన చర్యలు తీసుకున్నాయని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. జనవరి 8 నుంచి ప్రధానమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రులు కొరోనా మహమ్మారి పరిస్థితిపై సక్షిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రులంతా ప్రధానితో కలిసి మహమ్మారిపై పోరాటం చేశారన్నారు. జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నిర్దారణ అయ్యిందని, అప్పటి కంటే ముందు నుంచే అన్ని రకాల సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. మొదటి పాజిటివ్ కేసును గుర్తించిన సమయంలో 162 కాంటాక్ట్లను గుర్తించినట్లు చెప్పారు. మొత్తం పరిస్థితిని పర్యవేక్షించినందుకు ప్రధాని నరేంద్రమోదీని చరిత్ర గుర్తుంచుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఐదు శాస్త్రీయ సంస్థలు డేటాను ఇచ్చాయని, వాటి ఆధారంగా 14-29లక్షల కేసులను లాక్డౌన్ ద్వారా నిరోధించినట్లు చెప్పారు. లాక్డౌన్లో సుమారు 1,700 ల్యాబ్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ను ఎక్కడ మోహరించాలనే విషయంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదో ప్రధాని చూడలేదని, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, నోయిడాలో కోబాస్ మిషన్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఫిబ్రవరి, మార్చిలో మేం సామర్థ్యాన్ని పెంపొందించుకునే పని చేశామని చెప్పారు. అంతకుముందు విపక్షనేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ కొరోనా విషయంలో కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుని ఉంటే ఇంతదాకా వచ్చేది కాదన్నారు. న్యూఢిల్లీ వైరస్ నియంత్రణలో గోల్డెన్ సమయాన్ని కేంద్ర ప్రభుత్వం వృథా చేసిందని ఆజాద్ విమర్శించారు.