రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వద్ద 16.89 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ
పేదలకు మూడవ విడత ఉచిత సరుకులు ఈ నెల 29 నుంచి మే నెల 10వ తేదీ వరకు పంపిణీ చేయనున్నారు. కరోనా విపత్తు సమయంలో ఉపాధిలేని పేదలకు ఆకలి బాధ ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటికే రెండు విడతలుగా ఉచిత సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మూడో విడత పంపిణీ సందర్భంగా రెవిన్యూ అధికారులకు, డీలర్లకు ప్రత్యేక జాగ్రత్తలు సూచిస్తూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు.
కరోనా నేపథ్యంలో ఒక్కో దుకాణం పరిధిలో రోజుకు 30 మంది లబ్ధిదారులకు టైం స్లాట్ టోకన్లు ఇచ్చి పంపిణీ చేయాలి.మొదటి, రెండో విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించగా ఈసారి మాత్రం లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలి.అన్ని రేషన్ షాపుల వద్ద శానిటైజర్, మాస్కులు ఉంచాలి.ప్రతి లబ్ధిదారుడు బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకునేలా డీలర్లు జాగ్రత్త వహించాలి.