- కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ
- 2024 సార్వత్రిక ఎన్నికలపై సమాలోచనలు
- పార్టీలోకి ప్రశాంత్కు ఆహ్వానం
- సమావేశానికి రాహుల్, ప్రియాంక, సీనియర్ నేతల హాజరు
న్యూ దిల్లీ, ఏప్రిల్ 16 : వొచ్చే లోక్సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను గెలవాలని లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగాలని కాంగ్రెస్కు ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నచోట్ల ఇతర పార్టీలతో వ్యూహాత్మకంగా పొత్తు పెట్టుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ఉన్నత స్థాయి నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులతో శనివారం జరిగిన సమావేశంలో ఈ సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ఓ ప్రజంటేషన్ను సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా ఉందని చెప్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, 2024 లోక్సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.
కాంగ్రెస్ బలహీనంగా ఉన్నచోట్ల వ్యూహాత్మకంగా పొత్తులు కుదుర్చుకోవాలని తెలిపారు. ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని, అందుకు ప్రతిఫలంగా ఆయన ఏమీ కోరుకోవడం లేదని కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో ఆయన ప్రదర్శించిన ప్రజెంటేషన్లో పేర్కొన్న అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. కాగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్లో ప్రశాంత్ కిషోర్ చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. గాంధీ కుటుంబంతో ప్రశాంత్ కిషోర్ భేటీలో ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల పరాజయంతో సహా అనేక ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ను పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.
గుజరాత్ పోల్స్పై చర్చించడానికే ఈ భేటీ జరిగిందని..గుజరాత్తో పాటు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల బ్లూప్రింట్పై కూడా చర్చించినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్కు అప్పగిస్తుందనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే పీకే మాత్రం గుజరాత్ ఎన్నికలకు మాత్రమే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా తన రాజకీయ భవిష్యత్తుపై మే 6లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ప్రకటించగా.. ఆలోపే కాంగ్రెస్లో చేరికపై స్పష్టత రానుంది. సోనియా గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, అజయ్ మాకెన్ పాల్గొన్నారు.