వెంకయ్య నాయుడు, జగన్, కెటిఆర్ సహా పలువురు ప్రముఖుల సంతాపం
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఫిబ్రవరి 21 : ఏపి రాష్ట్ర ఐటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరం చెందారు. ఆయన వయస్సు 50 సంవత్సరాలు. నిన్న మొన్నటి వరకు ఉత్సాహంగా దుబాయ్లో పెట్టుబడుల కోసం జరిగిన సమ్మిట్లో పాల్గొని..హైదరాబాద్కు వొచ్చిన ఆయనకు సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్లినా లాభం లేకుండా పోయింది. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా హాస్పిటల్కి వొచ్చేటప్పటికే గౌతమ్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని అపోలో వైద్యులు ప్రకటించారు. ఆయన గత నెల 22న కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. గౌతమ్ రెడ్డి ఇకలేరన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గౌతమ్ మృతిపట్ల ఉప ర్రాపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేబినెట్ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు. గౌతమ్రెడ్డి 1971 నవంబర్ 2న జన్మించారు. గౌతమ్రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. బుధవారం నెల్లూరులోనే మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.