- గ్రేటర్లో పెరుగుతున్న కేసులు
- నేడు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష
- కొరోనా, వానకాలం సాగు, రాష్ట్ర అవతరణదినోత్సవంపై చర్చ
కొరోనా కట్టడికి లాక్డౌన్ పక్కాగా అమలు చేస్తున్నా గ్రేటర్ పరిధిలో దాని విస్తృతి ఆందోళన కలిగిస్తోంది. మరోమారు సడలింపులు ఎత్తేయాలా అన్న రీతిలో పరిస్థితులు ఉన్నాయి. గ్రేటర్లో పెరుగుతున్న కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ దశలో మరోమారు సిఎం కెసిఆర్ కొరోనా వ్యాప్తిపై చర్చించనున్నారు. తీసుకున్న చర్యలు, కరోనా అరికడుతున్నతీరును సక్షించబోతున్నారు. దీనికితోడు వానకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలపై చర్చించేందుకు బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రగతిభవన్లో సమావేశం ప్రారంభంకానుంది. కొరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలుపై ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో సరి, బేసి విధానంలో దుకాణాలను తెరుస్తున్నారు. మరికొంత కాలం ఇదే పద్ధతిని కొనసాగించాలా? మార్పులు చేయాలా? అనే విషయంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో వానకాల వ్యవసాయంపై చర్చిస్తారు. గ్రామాల్లో ఎరువులతో పాటు విత్తనాల అందుబాటుపై సక్ష చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు. జూన్ 2న రాష్ట్ర అవతరణదినోత్సవం ఎలా జరపాలన్న విషయంపై కూడా సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెలాఖరుకు లాక్డౌన్ ముగుస్తున్నందున కేంద్ర మార్గదర్శరకాల మేరకు ఎలా ముందుకు వెళ్లాలన్నది కూడా నిర్ణయించుకోవాల్సి ఉంది. అలాగే విద్యారంగంపై చర్చించాల్సి ఉంది. టెన్త్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అకడమిక్ ఇయర్కు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ సంఘాలు అనేకానేక సమస్యలను ముందు పెట్టారు. పూర్తిస్థాయితో జీతాలు ఇవ్వడంతో పాటు, పదవీవిరమణ వయసును పెంచాలని కోరుతున్నారు. వీటన్నింటిపైనా కెసిఆర్ చర్చించే అవకాశం ఉంది. అధికారులు వీటికి సంబందించిన సమాచారాన్ని సిద్దం చేస్తున్నారు.
నగర శివారుల్లో కరోనా కలకలం
కరోనా పాజిటివ్ కేసులతో ఆందోళన
నగర శివారులో మరోమారు కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని ధారుర్ మండలం గ్టటెపల్లి గ్రామంలో చాకలి నర్సింలు(40)కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే డాక్టర్, పోలీసులు, అధికారులు గ్రామానికి చేరుకుని కుటుంబసభ్యులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. నర్సింహులు క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రులకు తిరిగే వాడని అక్కడే కరోనా సోకి ఉంటుందనే అనేమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంతో తాండూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలు చేసుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. ఇకపోతే శేరిలింగంపల్లి జోన్లో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. సాప్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో మరో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. శేరిలింగంపల్లి సర్కిల్(20) పరిధిలో కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో సాప్ట్వేర్ ఇంజినీర్కు కరోనా పాజిటివ్ రాగా ఈరోజు అతని భార్య(31), కొడుకు(3), బావమరిది(34), బావమరిది కూతురుకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
బాలునికి కరోనా పాజిటివ్
పొట్ట కూటి కోసం పక్క రాష్ట్రాలకు వలస పోయిన కార్మికులకు లాక్ డౌన్ పెను శాపంగా మారింది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు పనులు లేక స్వస్థలాలకు తరలి వస్తున్నారు. దీంతో పని చేసేచోట కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నారు. తాజాగా నారాయణపేట జిల్లాలో నాలుగు నెలల పసివాడికి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం ముంబై నుంచి వచ్చిన వలస కూలీ, అతని కుమారుడికి పరీక్షలు నిర్వహించగా బాలునికి కరోనా పాజిటివ్ గా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యం కోసం వారిని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు.