వారికి మునిసిపల్ ట్యాక్స్ సహా అన్ని విధాలా ప్రోత్సాహం
యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్
భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే : మహీంద్రా ఎలక్టిక్ వాహనాల యూనిట్కు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన
హైదరాబాద్/సంగా రెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తే అబ్బురమనిపిస్తున్నదని చెప్పారు. ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి ఎంత సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సీఎం ట్రైబల్ ఆంతప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకం లబ్దిదారులకు మున్సిపల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇస్తామన్నారు. హైదరాబాద్లోని బంజారా భవన్లో 24 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సమాజంలో అన్ని కులమతాల మధ్య గీతలను కొరోనా చెరిపివేసిందన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితే కులవ్యత్యాసాలు రూపుమాసిపోతాయన్నారు. ఇన్నోవేషన్, ఇన్ఫాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనేవి దేశాభివృద్ధికి మూడు సూత్రాలని చెప్పారు.
ప్రపంచ అగశ్రేణి సంస్థలకు భారతీయులు సీఈవోలుగా ఉన్నారని, కానీ దేశం నుంచి వొచ్చిన ఇన్నోవేషన్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ 30 శాతం పంచాయతీ అవార్డులను గెలుచుకున్నదని చెప్పారు. కొత్త పారిశ్రామిక వేత్తలను మరింతమంది యువతను ప్రోత్సహించాలని సూచించారు. ఎస్టీ యువ వ్యాపారవేత్తలను మున్సిపల్ శాఖ ద్వారా ప్రోత్సహిస్తామన్నారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. గిరిజన యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న కేటీఆర్కు మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ భరోసాతో గిరిజన యువత అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున గిరిజనులకు సేవాలాల్, కొమురంభీమ్ భవనాలును ప్రభుత్వం నిర్మించిందని వెల్లడించారు. ఎస్టీ రిజర్వేషన్లను సీఎం కేసీఆర్ 10 శాతానికి పెంచారని చెప్పారు.
భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే : మహీంద్రా ఎలక్టిక్ వాహనాల యూనిట్కు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన
భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీలో, ప్రైవేట్ వెహికల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి రాష్ట్రం అడ్డాగా మారాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి సంబంధించిన అన్ని రకాల పార్ట్లు తయారయ్యే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. హైదరాబాద్లో ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ఒప్పందాలు చేసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ యూనిట్కు మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావుతో పాటు పలువురు నాయకులు, కంపెనీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…మహీంద్రా అండ్ మహీంద్రా వారు తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రిక్ పాలసీ నచ్చి రూ. 1000 కోట్ల పెట్టుబడి జహీరాబాద్లో పెట్టడం సంతోషంగా ఉందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమ స్థాపనకు కావాల్సిన అన్ని అనుమతులను 21 రోజుల్లో ఇస్తున్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ వొచ్చిన తర్వాత 23 వేల పరిశ్రమలు నెలకొల్పాము. మూడు లక్షల 30 వేల పెట్టుబడులు వొచ్చాయి. 20లక్షల మందికి ఉపాధి అవకశాలు లభించాయని తెలిపారు. కొత్తగా వొచ్చే కంపెనీలలో స్థానిక యువతకు పెద్దపీట వేసి ఉద్యోగాలు ఇస్తామన్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని స్థానిక యువత కోసం ప్రభుత్వ పరంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్ పెంచుకోవాలని కేటీఆర్ సూచించారు.