- లిక్కర్ ధరలను సమర్థించిన
- మంత్రి నారాయణస్వామి
- మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామన్న
- మంత్రి ఆదిమూలపు
అమరావతి,మే 6 : ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా మద్యపాన నిషేధం చేసి తీరుతామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఈ క్రమంలోనే మద్యం దరలు పెంచాల్సి వచ్చిందన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో డియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యపాన నిషేధానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని గుర్తు చేశారు. అందుకే షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంచామని ఆయన తెలిపారు. చంద్రబాబుకి సీఎం జగన్ని విమర్శించే అర్హత లేదని, ఎన్టీఆర్ తెచ్చిన మద్యపాన నిషేధాన్ని బాబు ఎత్తేశాడని నారాయణ స్వామి మండిపడ్డారు. బాబు గత ఐదేళ్లలో 43వేల బెల్టు షాపులతో మద్యాన్ని గ్రామాల్లో పారించాడని నారాయణ స్వామి దుయ్యబట్టారు. తాము 20 శాతం షాపులు, 43 వేల బెల్టు షాపులు తొలగించామని ఆయన గుర్తుచేశారు. టీడీపీ నేతలు నాటుసారా, నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మనుషులే బార్లలో అక్రమ మద్యం వ్యాపారం చేశారని నారాయణ స్వామి తెలిపారు.
వందల కోట్లు మద్యం ముడుపులు తీసుకున్నది చంద్రబాబే అని అన్నారు. ధరలు పెంచితే చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మహిళల కోసం సీఎం వైఎస్ జగన్ దశల వారీ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారని నారాయణ స్వామి తెలిపారు. ఏపీలో కరోనా కట్టడికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లాలో అన్నారు. ప్రతిపక్ష నేతలా ముఖ్యమంత్రి జగన్ మాటలు చెప్పే నేత కాదని.. దేశంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షలకు 2500 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతీ విషయాన్ని రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. మద్యంపై వారి మాటలు గురివింద సామెతను గుర్తుచేస్తున్నా యని..మద్యం కొనాలంటే షాక్ కొట్టాలనే ధరలు పెంచామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు.