- ఇప్పటికిప్పుడు భయం లేదు..
- పిల్లలను ధైర్యంగా స్కూళ్లకు పంపండి
- థర్డ్వేవ్ వొచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధం
- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు
తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా బడికి పంపాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఇప్పటికప్పుడు థర్డ్వేవ్ భయమైతే లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభ మయ్యాయన్నారు. టీకా తీసుకున్న సిబ్బందికే పాఠశాలల్లోకి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. పాఠశాలలో మాస్క్, తరచూ శానిటైజర్ వాడాలని కోరారు. థర్డ్ వేవ్పై శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపారు. కొరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాలున్నాయని, తొలి రోజు తక్కువ మంది విద్యార్థులు పాఠశాలలకు వొచ్చారన్నారు. కోవిడ్, సీజనల్ వ్యాధుల లక్షణాలుంటే పిల్లలను బడికి పంపొద్దని కోరారు. 95శాతం మంది పాఠశాల సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు చెప్పారు.
కొత్త రకం స్ట్రెయిన్ వొస్తే తప్ప మూడో వేవ్కు అవకాశం లేదన్నారు. థర్డ్ వేవ్ వొచ్చినా ఎదుర్కునేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. కొవిడ్తో విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని, పిల్లల్లో విద్యపై ఆసక్తి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఫోన్లకు బానిసలవుతున్నారని, పిల్లల మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు తెరిచినట్లు వెల్లడించారు. 1-10 ఏళ్ల లోపు వారిలో కేవలం 3శాతం మాత్రమే కోవిడ్ బారినపడ్డారని, 20 ఏళ్లల్లో వారిలో 13శాతం మందికి కోవిడ్ సోకిందన్నారు. పిల్లలకు కోవిడ్ సోకినా 100 శాతం కోలుకుంటున్నారని వివరించారు. సీరో సర్వే ప్రకారం పెద్దల్లో 63శాతం యాంటీబాడీలున్నాయని తెలిపారు.
బోనాలు వంటి వేడుకలు జరిగినా రాష్ట్రంలో కొరోనా కేసులు పెరుగులేదని, పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు. ఈ నెలలో 50 లక్షల కోవిడ్ టీకాలు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. 12 సంవత్సరాలు నిండిన పిల్లలకు టీకా ఈ నెలలో వొచ్చే అవకాశం ఉందని శ్రీనివాస్రావు పేర్కొన్నారు. రెండు సంవత్సరాలు నిండిన పిల్లల కోసం భారత్ బయోటెక్ టీకా అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఈ టీకా రెండు నెలల్లో అందుబాటులోకి వొచ్చే అవకాశం ఉందని చెప్పారు. స్కూళ్లలో బుధవారం విద్యార్థుల హాజరుశాతం స్వల్పమేనన్నారు. కోవిడ్ కట్టడికి మొదటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. మరణాల శాతం కేవలం 0.5 శాతం, రికవరీ రేటు 98.5 శాతం ఉందన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భయపడాల్సిన పని లేదన్నారు. కోవిడ్ వాక్సినేషన్ వేగంగా సాగుతుందన్నారు. థర్డ్ వేవ్ గురించి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు.