పదహారవ శతాబ్దం లోనే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్వావలంబన, సమానత్వం అంది ంచుటకు వీరోచితంగా పోరాడిన ఓ సామాన్యుని సామాజిక న్యాయ పోరాట చరిత్ర చరిత్ర పుటలకు ఎక్కలేదు.. కళ్ళముందు నిలువెత్తు సాక్ష్యాలు కనిపించినా పరిశీలించే వారు కరువైనారు. రాజరికపు అన్యాయాలను సహించలేక కడుపు మండి కత్తిపట్టిన వీరునికి దక్కాల్సిన కీర్తి దక్కలేదు. పరాయి పాలకులు ఆంగ్లేయులు గుర్తించి లండన్లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో చిత్రపటం ఉంచి సముచితంగాగౌరవించిన … మనం మాత్రం మరిచిపోవడం ఆశ్చర్యకరం. సామాన్య గీత కార్మిక కుటుంబంలో పుట్టి మొగల్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించి గోల్కొండ కిల్లాపై బహుజనుల జెండాను ఎగురవేసిన సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి నేడు.. ఆయన పుట్టినరోజు సందర్భంగా సర్వాయి పాపన్న ను మనం ఎందుకు యాది చేసుకోవాలి? ఆయన ఆశయాలు ఏమిటి?ఆయన నుండి పొందవలసిన స్ఫూర్తి ఏమిటి? అని పరిశీలించడానికి మరుగునపడిన ఆయన జీవిత చరిత్ర లోకి తొంగి చూద్దాం… దూల్మిట్ట శాసనం ప్రకారం సర్వాయి పాపన్న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషా పురం గ్రామంలో అతి సామాన్య గౌడ కుటుంబంలో ధర్మన్న గౌడ్ ,సర్వమ్మ దంపతులకు ఆగస్టు 18, 1650 న జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి సర్వమ్మ అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసింది. ఆమె కోరిక మేరకు గౌడ వృత్తిని చేపట్టి తాడి చెట్లు ఎక్కి కల్లు గీస్తూ కుటుంబ పోషణకు సహాయపడుతూ ,పశువుల కాపరిగా పనిచేస్తూ , ఇతర కులాలవారితో స్నేహం చేస్తూ సరదాగా గడిపేవాడు పాపన్న. ఆ నాటి నైజాం రాజు అనేక రకాల పన్నులు వసూలు చేస్తూ ప్రజలను ఘోరంగా హింసిస్తూ కులాల, మతాల పేరిట శిస్తూ వసూలు చేసేవారు. తాటి చెట్ల కుకూడా పన్ను వసూలు చేసేవారు. ప్రజలు పన్నులు చెల్లించక పోయిన ఎదురు మాట్లాడిన ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. పాపన్నకు స్నేహితులు ఎక్కువగా ఉండేవారు. ఆయన వెంట నిత్యం చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరిగోవిందు ,జక్కుల పెరమాండ్లు , దూదేకులపీరు, కోత్వాల్ మీరు సాహెబ్ లు ప్రధాన అనుచరులుగా ఉండేవారు. వారంతా ఒక చోట చేరి వారి చుట్టూ జరుగుతున్న సంఘటనల గురించి గంటలు గంటలు చర్చిస్తూ ఉండేవారు. ఆనాటి నిజాం సైనికులు గ్రామాల వెంట గుర్రాలపై స్వారీ చేస్తూ ,పన్నులు వసూలు చేస్తూ దౌర్జన్యాలు, దారుణాలకు పాల్పడుతూ ఉండేవారు.
అప్పుడప్పుడు సర్వాయి పాపన్న కల్లుమండవ దగ్గర కి వచ్చి కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోయేవారు. ఇలా ఒకటి రెండు సార్లు జరిగింది. రాజుగారు సైనికులు అంటే గౌరవ భావాన్ని కలిగి ఉన్న సర్వాయి పాపన్న పెద్దగా పట్టించుకునే వాడు కాదు. ఒక రోజు నిజాం సైనికులు కల్లు మండువ దగ్గర కల్లు తాగి పోయే క్రమంలో ఉన్నప్పుడు, అటు వైపు వచ్చిన పాపన్న స్నేహితుడుఒకరు ధనరాసులు ఉన్న కల్లు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద నిజాం సైనికులు వెళ్లి పోవుటకు సిద్ధమయ్యారా అని సరసంగా మాట్లాడేసరికి కోపోద్రిక్తులైన సైనికుల్లో ఒకరు పాపన్న స్నేహితుణ్ణి కాలు ఎత్తి తన్నుట ఉపక్రమించడం తో ఆగ్రహోదగ్రుడైన సర్వాయి పాపన్న కల్లుగీసే మారు కత్తితో మెడ నరికి చంపి వేశాడు . దీంతో భయం కంపితులైన మిగతా సైనికులు గుర్రాలను వసూలు చేసిన డబ్బులను వదిలి పారిపోయారు. పాపన్న అతని స్నేహితులు గుర్రాలు డబ్బులు తీసుకొని గ్రామంలోకి వచ్చి పేద ప్రజలకు పంచుతారు. అప్పటినుండి సర్వాయి పాపన్న అతని స్నేహితులు సైనికులపై దాడులు చేసి పన్నుల రూపేణా వసూలు చేసిన డబ్బులను దోచి చుట్టుపక్కల గ్రామాల్లో గల పేదవారి కి పంచేవారు. దీంతో పాపన్న పేరు ఆయా గ్రామాలలో మారుమోగింది. ఆ డబ్బుతోనే ఆయుధాలు ,గుర్రాలు సమకూర్చుకున్నాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. గ్రామాల్లోని యువకులు సైనికులు గా చేరారు. అలా మూడు వేల మందిని సొంత సైన్యం గా తయారు చేసుకున్నాడు. తెలంగాణలో నిజాం సైనికులు ,వారి తాబేదార్లు, జమీందార్లు ,జాగీర్దార్లు ,దొరలు, భూస్వాములు ఆగడాలను ,దురాగతాలను చూసి రాజ్యాధికారమే వీటికి పరిష్కారం అని భావించి మొఘల్ సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై బడుగుల జెండాను ఎగురవేయాలనే నిర్ణయంతో ఆ దిశగా ప్రయత్నాలు చేసి భువనగిరికోటను స్వాధీన పరచుకున్నాడు. పాపన్నకు ఎలాంటి వారసత్వంగాని ,నాయకత్వం గానీ ,ధనం గాని ,అధికారాలు గానీ లేవు. గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకొనీ క్రీ.శ. 1675 లో సర్వాయిపేట లో రాజ్యస్థాపన చేశాడు. ఆ సమయంలో మరాఠప్రాంతంలో మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబు ను చత్రపతి శివాజీ ఎదుర్కొంటున్న సందర్భం. పాపన్న కూడా క్రీస్తుశకం 1687-1724 వరకు ఔరంగజేబ్ సైన్యాన్ని కి వ్యతిరేకంగా పోరాటం చేసి కోటనుస్వా ధిన పరచుకొని1678లో తాటికొండ ,వేములకొండ దుర్గములను నిర్మించాడు. ఒక సామాన్య వ్యక్తి శత్రుదుర్భేద్యమైన కోట లను వశపరచుకున్నాడు . అతని ధాటికి భయపడ్డ భూస్వాములు జాగీర్దారులు మొగల్ తోత్తు లైననిజాం సైనికులు కుట్రలు పన్ని పాపన్న సైన్యాన్ని బలహీన పరిచి ఔరంగజేబ్ కు లేనిపోని మాటలు చెప్పగా,ఔరంగజేబు కొలనుపాక సర్దార్ రుస్తుంది లాన్ కు బాధ్యతలు అప్పగించగా ఆయన ఖాసిం ఖాన్ ను పాపన్న తో యుద్ధానికి పంపాడు.
షాపురం వద్ద జరిగిన యుద్ధంలో ఖాసిం ఖాన్ ను చంపడంతో రుస్తుందిల్ ఖాన్ మరింత సైన్యం తోస్వయంగా యుద్ధం లో
పాల్గొనగా ఓటమి తప్పదని భావించి , తన ప్రాణ స్నేహితుడైన సర్వన్న ను పోగొట్టుకొనిమరో మార్గం ద్వారా తప్పించుకొని బయటపడి, అప్పటి నుండి తన పేరును సర్వాయి పాపన్న గా మార్చుకున్నాడు. కొంతకాలం అజ్ఞాత జీవితాన్ని గడిపాడు.తిరిగి 12 వేల సైన్యాన్ని కూడగట్టుకొని గోల్కొండ కోట ను స్వాధీనపరచుకొని 7నెలల పాటుఅధికారం చెలాయించడం జరిగింది. అతని సామ్రాజ్యం తాటికొండ కొలనుపాక చేర్యాల నుండి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ హుజరాబాద్ ల వరకు విస్తరింపజేశాడు. భువనగిరి కోట రాజధాని గా 30 ఏళ్ళ పరిపాలన చేశాడు. సర్వాయి పాపన్న సామాన్య కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి ప్రజల కష్టనష్టాలు తెలుసు. అందుకే ఆయన పరిపాలనలో పన్నులు లేవు . సామాజిక న్యాయం వికసించింది. ప్రజామోదం యోగ్యమైన పనులు చేస్తూ నీటివనరుల కోసం చెక్డ్యాంలు సైతం నిర్మింపజేశాడు. ప్రజారంజకంగా ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా పాలిస్తున్న సమయంలో ఔరంగజేబ్ మరణించడంతో, బహుదూర్షా చక్రవర్తి అయ్యాడు. ఆ సమయంలో దక్కని పాలకుడైన కం బాక్షి ఖాన్ బలహీన పాలనను చూసి క్రీస్తు శ కం 1708 ఏప్రిల్ 1న వరంగల్ కోట పై దాడి చేసి, కోటలోనే అమాయక ప్రజలను విడిపించి దానిని వశపరచుకొని, పోగొట్టుకున్న కోటలన్నిటిని తిరిగి స్వాధీనపరచుకొనడంతో మొగల్ చక్రవర్తి బహదూర్షా ఒక డచ్ రిపోర్టర్ ద్వారా సర్వాయి పాపన్న పరాక్రమాన్ని స్వయం పాలనను తెలుసుకొని, కొంత డబ్బు చెల్లించి చట్టబద్ధంగా పాలించు కొమ్మని తెలుపగా, పాపన్న 14 లక్షల రూపాయలు చెల్లించి, మొగల్ సామ్రాజ్యానికి నిత్యావసర సరుకులను అందించి గోల్కొండ కోటకు రాజైనాడు. ఒక సామాన్య గీత కార్మికుడు గోల్కొండకు రాజు అవ్యడం ,సుపరిపాలన అందిస్తూ పేద ప్రజల గుండెల్లో రారాజుగా నిలిచి పోవడాన్ని సహించలేని భూస్వాములు, దొరలు,ఆధిపత్య వర్గాలు చక్రవర్తి బహుదూర్ షా కు చాడీలు చెప్పి అంతమొందించెందుకు కుట్రలుపన్నడంతోమరోమారుమొఘల్ సైన్యం తో• క్రీస్తు శకం1709లో తాటికొండ వద్ద యుద్ధంనకు తలపడి కాల్పులకు గురై తప్పించుక ని పారిపోయి హూజురాబాద్ లో కల్లుగీత కార్మికుడీగా తలదాచుకున్న పాపన్నను మొఘల్ సైన్యం గుర్తించి, బంధించి తల నరికి మొండెంను గోల్కొండ కోటకు వేలాడదీసి , తలను బాద్ షాకు కానుకగా పంపారు.
అంతటి ధీరుడైన సర్వాయి పాపన్న నుండి మనం గ్రహించవలసిన దిఏమిటి? ఆయన జీవిత చరిత్ర నుండి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడటం, అన్యాయాన్ని ఎదిరించడం, పేద ప్రజలకు తోటివారికి సాయపడటం, బహుజనకులాలను ఐక్యంగా నిలపడం…. పాలకునిగా పరిశీలించినప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం పన్నులు లేకుండా సాంఘిక ,సమానత్వపు న్యాయాలను అందించడం, రైతు సంక్షేమం కోసం నీటి వనరులు కల్పించడం, స్వయం సమృద్ధి సాధన దిశగా, సంస్కరణవాది గా మేధావిగా గుర్తించ వచ్చు. అంతేకాకుండా ఆయనలో భూస్వామ్య వ్యతిరేక పోరాట దారునిగా, సామాన్య ప్రజలను అణగారిన కులాల వారికి తన సైన్యంలో నాయకత్వపు బాధ్యతలు అప్పగించి, బహుజనులకు దానధర్మాలు చేయడం, వారి ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ గుడులు కట్టించి ఉత్సవాలు నడిపిస్తూ స్వయంగా పాల్గొనడం ద్వారా బుద్ధుని ఆలోచనలు కనిపిస్తాయి. దళిత బహుజన రాజ్యాధికారమై తన జీవితాంతం పాటుపడి ప్రాణాలర్పించిన పాపన్నను సామాజిక విప్లవకారుడిగా కొనియాడ వచ్చు. మరి నేటిదళిత బహుజనుల పరిస్థితి ఏమిటి? 16వ శతాబ్దం లోన అణగారిన కులాల అభివృద్ధి చెందాలంటే, సాంఘిక న్యాయం, సమాన అవకాశాలు లభించాలంటే రాజ్యాధికారమే శరణ్యమని భావించి ఒక్కడిగా అడుగు ముందుకేసి 12 మంది బహుజన సైన్యంతో మొదలుపెట్టి 12 వేల మంది సైన్యాన్ని తయారు చేసుకొని మొగల్ సామ్రాజ్యాన్ని సైతం గడగడలాడించిన వీరుడు సర్వాయి పాపన్న వారసులైన నేటి దళిత బహుజనులకు ఆ స్ఫూర్తికొరవడటం విచారకరం. ఎవరికివారే యమునాతీరే అన్నట్లు ఐక్యంగా లేకపోవడం మూలంగా విభజించు పాలించు పద్ధతిన దళిత బహుజనులను ఒకటి గా ఉండనీ యకుండా చేస్తూ ఆధిపత్య వర్గాలు రాజ్యాధికారాన్ని ఏలుతున్నారు. వారి సమస్యలను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకొని ఏకతాటి పైకి వచ్చి రాజ్యాధికారం కోసం పోరాడవలసి ఉంది . అందుకే సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ, సాధించడానికి ఉత్పత్తి కులాల వారు ఐక్యంగా కలసికట్టుగా నడుం బిగించి నడవాలని నడుస్తారని ఆశిద్దాం.

ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్. మహబఃబాద్ జిల్లా. 9989584665