Take a fresh look at your lifestyle.

పట్టణం నుంచి గ్రామాలకు పయనం షురూ..

  • కొరోనా భయంతో ఊరికి తరలి వెళ్తున్నజనం..
  • నగరాల్లో పెద్ద ఎత్తున పాజిటివ్‌ ‌నమోదు అవుతున్న కేసులు..
  • కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, ‌వీకెండ్‌ ‌లాక్డౌన్‌, ‌నైట్‌ ‌కర్ఫ్యూలు అమలు..
  • రద్దీగా మారిన రైల్వేస్టేషన్లు, బస్‌ ‌స్టాండ్లు..

యావత్‌ ‌ప్రపంచాన్ని కబళిస్తున్న కొరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతుంది. సరిగ్గా ఏడాది క్రితం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, అలాంటి దుస్థితి మళ్ళీ తాజాగా దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. గతేడాది కొరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ ‌విధించడంతో నగరాల్లో, పట్టణాల్లో ఉన్న బడుగుజీవులు గత్యంతరంలేని పరిస్థితుల్లో సొంతూళ్ళకు ఏదో ఒక రకంగా వెళ్ళిపోవాలనే ధ్యేయంతో ప్రయాణాలు చేశారు. కొందరు కాలినడకను, సైకిళ్ళను, సొంత వాహనాలను, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు, స్పెషల్‌ ‌రైళ్ళలో సొంతూళ్ళకు చేరుకున్నారు. పరిస్థితి దాదాపుగా చక్కబడిందనుకొని నాలుగైదు నెలల క్రితం మళ్ళీ నగరబాట పట్టిన వారికి తాజా పరిణామాలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. గత కొన్ని రోజులుగా కొరోనా పాజిటివ్‌ ‌కేసుల్లో పురోగతి ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ఉండడం, సంక్రమణ రేటు రెట్టింపు కావడంతో రాష్ట్రాలు ఇప్పటికే పలు నగరాల్లో ఆంక్షలు విధించాయి. ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుందో అనే డోలాయమాన పరిస్థితి నెలకొంది. గత నాలుగైదు రోజులుగా రోజుకు లక్షకు పైగా పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఏరకంగా మారుతుందో అంచనా వేయడం కష్టమౌతోంది. ఒకవైపు కేసులు పెరుగుతుండడం, మరోవైపు వ్యాక్సినేషన్‌ ‌చేసేందుకు తమ వద్ద అవసరానికి ఉండాల్సిన స్టాక్‌ ‌లేదని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువొచ్చాయి. మహారాష్ట్రలో స్టాక్‌ అం‌దుబాటులో లేని కారణంగా పలుచోట్లు వ్యాక్సినేషన్‌ ‌పక్రియకు బ్రేక్‌ ‌పడింది. మరోవైపు తాజాగా రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌శుక్రవారం ప్రధాని రాసిన లేఖలో మరో రెండు రోజులకు మాత్రమే  టీకా స్టాక్‌ ఉం‌దని రాష్ట్ర పరిస్థితిని బహిర్గత పరచడంతో కొరోనా సంక్రమణ రాబోయే నెలల్లో తమ జీవితాలపై ఏవిధంగా ప్రభావం చూపిస్తుందనే భయాందోళనలు ప్రజల్లో  ఎక్కువౌతున్నాయి. దీంతో ఇలాంటి సంక్రమణ పరిస్థితుల్లో నగరాల్లో జీవించడం కంటే తమ సొంత ఊరుని నమ్ముకుంటేనే మేలని అనేకమంది భావిస్తున్నారు. కేవలం వలస జీవులు మాత్రమే కాకుండా పోటీ పరీక్షల కోసం  సిద్ధమయ్యేందుకు వొచ్చిన విద్యార్థులు సైతం తాజా నిర్ణయాలతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. అందులో భాగంగా ప్రజలు ప్రయాణాలకు సిద్ధపడడంతో రైల్వే స్టేషన్లు, బస్‌ ‌స్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే సహా అనేక నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అనధికారిక వర్గాలు ప్రకటించాయి.

కొరోనా మహమ్మారి వ్యాప్తి భయంతో వలస కార్మికులు అనేకమంది స్వగ్రామాలకు వెళుతున్న నేపథ్యంలో రైలు సర్వీసుల కొనసాగింపుపై శుక్రవారం  రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. రైలు సేవలను తగ్గించడానికి కానీ, ఆపడానికి సంబంధించి కానీ ఎటువంటి ప్రణాళిక లేదని, డిమాండ్‌ ‌ప్రకారం రైళ్లు నడిపిస్తామని, అవసరమైతే మరిన్ని పెంచుతామని రైల్వే బోర్డు చైర్మన్‌ ‌సునీత్‌ ‌శర్మ ప్రయాణికులకు హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ‌కర్ణాటక, ఉత్తర్‌‌ప్రదేశ్‌, ‌ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, ‌తమిళనాడు, గుజరాత్‌, ‌కేరళ, పంజాబ్‌ ‌రాష్ట్రాల్లో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. కొత్త కేసుల్లో 84.21 శాతం ఈ 10 రాష్ట్రాల నుంచి నమోదవుతున్నాయి. దీంతో సంక్రమణ రేటుని తగ్గించేందుకు వీకెండ్‌ ‌లాక్‌డౌన్‌, ‌లాక్‌డౌన్‌, ‌నైట్‌ ‌కర్ఫ్యూలను అనేక రాష్ట్రాల్లో అమలులోకి తీసుకొచ్చారు. ఈ చర్యలే కాకుండా అనేక రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలలు, షాపింగ్‌ ‌మాల్స్, ‌మార్కెట్లను మూసివేశాయి. దేశ రాజధానిలో ఈనెల ఆరవ తేదీన ప్రారంభమైన నైట్‌ ‌కర్ఫ్యూ  ఏప్రిల్‌ 30‌వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే, గర్భిణీ స్త్రీలు, రోగులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్సు టెర్మినస్‌ ‌నుండి టిక్కెట్లు చూపించి ప్రయాణించే వారికి మాత్రం ప్రభుత్వం పరిమితుల నుంచి మినహాయింపు ఇచ్చింది. అయినప్పటికీ ఢిల్లీలో పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసుల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకుండా, సామాజిక దూరాన్ని పాటించని వారిపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. మాస్క్ ‌ధరించని వారికి రూ. రెండు వేలు జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని గౌతమ్‌ ‌బుద్ధ నగర్‌, అలహాబాద్‌, ‌మీరట్‌, ‌ఘజియాబాద్‌, ‌బరేలీ జిల్లాల్లో ప్రారంభమైన నైట్‌ ‌కర్ఫ్యూ ఈనెల 17వరకు అమలులో ఉండనుంది. అంతేగాక కాన్పూర్‌, ‌లక్నో మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధించారు. ఏప్రిల్‌ 10‌వ తేదీ నుంచి 20 తేదీ వరకు ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య నైట్‌ ‌కర్ఫ్యూని కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు, మంగళూరు, కల్బుర్గి, బీదర్‌, ‌తుంకూరు, ఉడిపి..మణిపాల్‌ ‌నగరాల్లో విధించనున్నారు. అంతేగాక ఇది రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వర్తిస్తుంది. శుక్రవారం రాత్రి నుంచి జమ్మూ కశ్మీర్‌లోని 8 జిల్లాల్లో నైట్‌ ‌కర్ఫ్యూ మొదలైంది.  జమ్మూ, ఉధంపూర్‌, ‌కథువా, శ్రీనగర్‌, ‌బారాముల్లా, బుద్గాం, అనంతనాగ్‌, ‌కుప్వారా జిల్లాల్లోని పట్టణప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాగ్‌పూర్‌ ‌సహా మహారాష్ట్రలోని అన్ని నగరాలు, జిల్లాల్లో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కఠినమైన లాక్డౌన్‌ ‌జరుగనుంది. కోవిడ్‌ -19 ‌కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో బీఎంసీ ముంబై నగరంలో వీకెండ్‌ ‌లాక్డౌన్‌ ‌విధించింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు. ముంబై అధికారులు నగరానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. పూణే మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌నగరంలో ఈనెల 30వ తేదీ వరకు అన్ని మార్కెట్లు, దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రభుత్వం దుర్గ్ ‌జిల్లాలో లాక్డౌన్‌ ‌ప్రకటించింది. సంక్రమణ రేటు ఎక్కువగా ఉండడంతో దుర్గ్ ‌జిల్లాలో ఈనెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పూర్తి లాక్డౌన్‌ ‌విధించారు. మరోవైపు రాయ్‌పూర్‌ను కంటైన్మెంట్‌ ‌జోన్‌గా ప్రకటించి, జిల్లా సరిహద్దులను శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈనెల 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు సీలు చేశారు. ఈ 10 రోజుల్లో కేవలం అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆంక్షలతో అనుమతి ఉంది. అంతేగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, సెమీ గవర్నమెంట్‌, ‌ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులను 10 రోజుల పాటు మూసివేశారు. మధ్యప్రదేశ్‌లోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన లాక్డౌన్‌ ‌పక్రియ సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. అంతేగాక ఈనెల 8 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో నైట్‌ ‌కర్ఫ్యూను విధించారు. ఇప్పటికే  గత మూడు వారాల్లో భోపాల్‌, ఇం‌డోర్‌, ‌జబల్పూర్‌, ‌గ్వాలియర్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారంనాడు లాక్డౌన్లను విధించింది. నైట్‌ ‌కర్ఫ్యూతో పాటు అనేక ఆంక్షలను జైపూర్‌ ‌సహా రాజస్థాన్‌లోని అన్ని నగరాలు, జిల్లాల్లో ఈనెల 5 నుంచి 19వ తేదీ వరకు కొనసాగించనున్నారు. నైట్‌ ‌కర్ఫ్యూని రాత్రి 8గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విధించారు.

ఈ నెల 30వ తేదీ వరకు పంజాబ్‌ అం‌తటా నైట్‌ ‌కర్ఫ్యూను పొడిగించినట్లు పంజాబ్‌ ‌ప్రభుత్వం ప్రకటించింది. గతంలో 12 జిల్లాల్లో విధించిన నైట్‌ ‌కర్ఫ్యూను రాష్ట్రంలోని మొత్తం 22 జిల్లాలకు విస్తరించారు. చంఢీగఢ్‌లోనూ ఏప్రిల్‌ 7‌వ తేదీ నుంచి నైట్‌ ‌కర్ఫ్యూ ప్రారంభమైంది. రాష్ట్రంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అధికారయంత్రాంగం కఠినమైన నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. నేటి నుంచి అమలులోకి వచ్చిన నిబంధనల కారణంగా కొరోనా వ్యాప్తిని కట్టడి చేయోచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.

Leave a Reply