- 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం
- 5-4 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం
- రెజ్లింగ్లో రజతం సాధించిన రవి దహియా
ఎలాగైనా స్వర్ణం గెలవాలని టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు సెమీస్తో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఒటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, గురువారం కాంస్యపతకం కోసం జరిగిన పోరులో భారత జట్టు జర్మనీతో తలపడింది. నాలుగు క్వార్టర్ లుగా సాగిన గేమ్ హోరాహోరీగా సాగింది. రెండు క్వార్టర్లు ముగిసే సరికి 3-3 గోల్స్తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. అయితే, మూడో క్వార్టర్లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది. కీలకమైన నాలుగో క్వార్టర్ ప్రారంభంలోనే జర్మనీ జట్టు గోల్ చేసి లీడ్ను 5-4కి తగ్గించింది. అయితే, భారత ఆటగాళ్లు ఆటపైన, బంతిపైన నియంత్రణ సాధించి జర్మనీ మరో గోల్ చేయకుండా అడ్డుకున్నారు.
దీంతో ఇండియా జట్టు 5-4 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 41 ఏళ్ల తరువాత హాకీ జట్టు ఒలింపిక్స్లో పతకం సాధించింది. భారత హాకీ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత హాకీ జట్టు సాధించిన విజయం యువతకు ఆదర్శమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఒలింపిక్స్లో ఆ జట్టు అసాధారణ ప్రతిభ కనబరిచిందని ప్రశంసించారు. చారిత్రక విజయంతో హాకీలో కొత్త శకానికి నాంది పలికిందని అన్నారు.
రెజ్లింగ్లో రజతం సాధించిన రవి దహియా
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఫైనల్లో భారత యోధుడు రవికుమార్ దహియాకు రజతం లభించింది. స్వర్ణం కోసం జరిగిన పోరులో రవికుమార్ రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జట్టుకు చెందిన జవూర్ ఉగుయేవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ ఫైనల్ పోరులో ఉగుయేవ్కు 7 పాయింట్లు దక్కగా, రవికుమార్ 4 పాయింట్లే సాధించి రజతంతో సరిపెట్టుకున్నాడు. కాగా, భారత్కు టోక్యో ఒలింపిక్స్లో ఇది రెండో రజతం. ఇంతకుముందు మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు తొలి రజతం అందించింది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు రెండు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించి, ఓవరాల్ పతకాల పట్టికలో 62వ స్థానంలో నిలిచింది.