91.27 శాతం ఉత్తీర్ణత..ఫలితాలను ప్రకటించిన మంత్రి ఆదిమూలపు
అమరావతి, అక్టోబర్ 1 : ఏపీ ఐసెట్లో అబ్బాయిలు సత్తా చాటారు. టాప్ 10లో ఎనిమిది మంది అబ్బాయిలు ర్యాంకులు సాధించారు. ఐసెట్ మొదటి ర్యాంకు శ్రీకాకుళం జిల్లా కాపు తెంబూరు గ్రమానికి చెందిన మాలపల్లి రామకృష్ణ సాధించినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రెండవ ర్యాంకు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన బండి లోకేష్, మూడవ ర్యాంకు విజయనగరం జిల్లా బుచ్చన్న పేటకు చెందిన తేనెల వెంకటేష్ సాధించారు.
కాగా ఆంధప్రదేశ్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్-2021 ఫలితాలు విడుదలయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. ఐసెట్ ఫలితాల్లో 38వేల మంది హాజరవగా 34,789 మంది అంటే 91.27 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాల కోసం వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష నిర్వహించిన రెండు వారాల్లోపే రికార్డు స్థాయిలో ఫలితాలను ప్రకటించినట్లు మంత్రి తెలిపారు.