పలు ఏరియాల్లో లాక్డౌన్ నిబంధనలను కఠినం చేయాలి
దేశంలో పెరుగుతున్న కొరోనా పాజిటివిటీ రేటు
కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్న కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్ట్ 4 : ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలను మెల్లగా తొలగిస్తుడటంతో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. దేశం మొత్తంగా చూస్తే ఇంకా 8 రాష్ట్రాల్లో కరోనా పెరుగుదలను సూచించే ఆర్ ఫ్యాక్టర్ (రీ ప్రొడక్షన్ రేటు) 1 కంటే ఎక్కువ అయినట్లు, దీనిని తగ్గించకపోతే కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని కేంద్రం హెచ్చరించింది. అంతేకాకుండా, గత వారం మొత్తం కరోనా గణాంకాలను చూస్తే, 44 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదైనట్లు పేర్కొంది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, గత వారం మొత్తం నమోదైన కేసుల్లో కేరళ రాష్ట్రంలోనే సగానికి పైగా కరోనా కేసులు వచ్చాయని తెలిపింది.
కేరళలో కేసులు పెరుగుదలకు ఏమైనా కొత్త కరోనా వేరియంట్ కారణం అయ్యే అవకాశం ఉందని, అయితే దీనిపై ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవని అధికారులు అన్నారు. దేశంలో ఆర్ ఫ్యాక్టర్ పెరగడం ఆందోళన కలిగించే విషయమని, కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నా ఏరియాల్లో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా సూచించారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ వంటి పద్ధతులను పాటిస్తేనే కరోనాను నియంత్రించగలుగుతామని, ఆర్ ఫ్యాక్టర్ 1 కంటే ఎక్కువ శాతం నమోదైతే కరోనా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుందనే భావించాలని గులేరియా చెప్పారు. కరోనా వైరస్ జన్యు మార్పుల్లో డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరమైందని, ఇంట్లో ఒకరికి డెల్టా వేరియంట్ సోకితే మిగతా వారందరికీ వంద శాతం అంటుకుంటుందని ఇప్పటికే చేసిన పరిశోధనల్లో రుజువైందని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు డోసులు వేసుకున్నా కూడా, అందరూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని గులేరియా సూచించారు.