- 108 అంబులెన్స్ వాహనాల సంఖ్యను 430కి పెంచాం
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
ప్రజాతంత్ర , హైదరాబాద్ : పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని రకాల వైద్య సేవలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బుధవారం వెంగళరావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఫ్యామిలీ వెల్ఫేర్లో నూతన అంబులెన్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తరువాత అత్యవసర సమయాల్లో రోగులను దవాఖానాలను తరలించేందుకు 108 అంబులెన్స్ వాహనాల సంఖ్యను 430కి పెంచామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సగటున 20 నిమిషాల్లో అంబులెన్స్ సేవలు అందుతున్నాయనీ, ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు లక్ష్యం ఏర్పాటు చేసుకున్నామన్నారు. అత్యవసర వైద్యం మీద ప్రజలకు మరింత నమ్మకం కలిగించేందుకు అంబునెన్సులకు వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లి 50 బైక్ అంబులెన్స్లను సైతం ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు.
దంతో పాటుగా మారుమూల పల్లెల నుంచి గర్భిణులను దవాఖానాలకు తరలించడానికి 300 అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 2018 నుంచి ఇప్పటి వరకు 38 లక్షల మంది గర్భిణులకు ఈ పథకం ద్వారా సేవలు అందించినట్లు చెప్పారు. అలాగే, అవసాన దశలో ఉన్న వారికి వైద్య సేవలు అందించేందుకు వీలుగా 30 ఆలనా వాహనాలను ఏర్పాటు చేసుకున్నామనీ, వాటి సేవలు నిరంతరంగా కొనసాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పారు.