- డ్రగ్స్ దందాలో కెసిఆర్ కుటుంబానికి లింక్
- లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకుండా డ్రామాలు
- నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న బండి పాదయాత్ర
నిర్మల్, ప్రజాతంత్ర, డిసెంబర్5 :హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయాల్సిందే-నని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని ఆరోపించారు. సీబీఐ విచారణకు పోతే అరెస్ట్ చేస్తారని కేసీఆర్ బిడ్డకు భయం పట్టుకుందని.. అందుకే విచారణకు వెళ్లకుండా కొత్త డ్రామాలకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని వ్యాఖ్యానించారు. కవితను అరెస్టు చేస్తే తెలంగాణ బిడ్డను అరెస్టు చేసినట్టుగా తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని కూడా బండి ఆరోపించారు. లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డ జైలుకు వెళ్లడం ఖాయం. దమ్ముంటే.. లిక్కర్ దందాలో విచారణకు హాజరై, తమ నిజాయితీ ఏంటో నిరూపించుకోవాలని బండి సంజయ్ ఆరోపణలు చేశారు.
నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలి. బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే… అదెలా సాధ్యం 37 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని కూల్చింది కేసీఆరే అని ఆయన మండిపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి …నీ అవినీతి, కబ్జాల చిట్టా మా దగ్గర ఉంది… ఇష్టానుసారంగా మాట్లాడితే అంతు చూస్తాం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన అల్లుడి కబ్జాలకు అంతే లేదు. మంత్రి పై విచారణ జరపాల్సిందేనని కామెంట్ చేశారు. చలాన్ల పేరుతో నిర్మల్ పోలీసులు రోజుకు లక్ష రూపాయలు వసూలు చేయాలట. 11 ఏళ్లుగా ఇక్కడి డీఎస్పీ తిష్టవేసి కిందస్థాయి సిబ్బందిపై వేధింపులకు గురిచేస్తున్నడు. నిర్మల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, నిర్మల్ సంగతేంటో… నేనే చూస్తానని పేర్కొన్నారు.
కరీంనగర్లో 16న బండి ముగింపు సభ
హాజరు కానున్న జాతీయ అధ్యక్షుడు నడ్డా
పోస్టర్ ఆవిష్కరించిన బిజెపి నేతలు
కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్5 : బండి సంజయ్ చేపట్టిన యాత్ర 16న కరీంనగర్లో ముగియనుంది. దీనికి బిజెపి అధ్యక్షుడు నడ్డా హాజరుకానున్నారు. ఈ మేరకు పోస్టర్ను ఆవిష్కరించారు. కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించేందుకు నవంబర్ 28న ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. కరీంనగర్ లో ఈనెల 16న యాత్ర ముగింపు సందర్భంగా ఎస్ఆర్ ఆర్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కమలనాథులు
సిద్ధమయ్యారు. ఈ మేరకు కరీంనగర్లో ఎంపీ కార్యాలయం వద్ద బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు పోస్టర్ను రిలీజ్ చేశారు. కరీంనగర్లో నిర్వహించే సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.
కరీంనగర్ బీజేపీ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని బీజేపీ నేతలు సూచించారు. కల్వకుంట్ల కుటుంబ పాలన అంతం చేయాలంటే ప్రజలందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్28న నిర్మల్లోని ఆడెల్లి పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, అశేష జనవాహిని మధ్య కాషాయ కార్యకర్తలతో కలిసి ఆయన ముథోల్ నుంచి బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభించారు.8 అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.