-
వోటుకు ఆరు వేలు..
-
ఆందోళన లో అందని వారు..నిరసనలు
- మా గ్రామాల్లో ఎందుకు పంచరంటూ మహిళల ధర్నా
- అవన్నీ ప్రభుత్వ డబ్బులే అంటూ పలువురు ఆందోళన
- మావి వోట్లు కాదా అంటూ రానివారు ఆగ్రహం
- ధర్నాతో ట్రాఫిక్ జామ్..సర్ది చెప్పిన పోలీసులు
- డబ్బుల పంపిణీపై కాంగ్రెస్ సీరియస్
- ఎన్నిక రద్దు చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
హుజూరాబాద్లో డబ్బుల పంపిణీ వ్యవహారం గందరగోళానికి దారితీసింది. పంచుతున్న డబ్బు ప్రభుత్వ సొమ్మే కనుక మాకెందుకు ఇవ్వరంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరి వారిని వారించారు. అయితే మాకు డబ్బు ఇచ్చే వారకు కదిలేది లేదంటూ వారు భీష్మించకుకు కూర్చున్నారు. ఇదిలావుంటే ఈ క్రమంలోనే గ్రామాల్లో బందోబస్తు పెంచారు. అయితే హుజురాబాద్లోని పలు గ్రామాల్లో డబ్బుల కోసం ఆందోళన నిర్వహించారు. తమ గ్రామంలో డబ్బులు కొందరికే ఇచ్చారని మండిపడ్డారు. రంగాపూర్, కాట్రపల్లి, పెద్ద పాపయ్య పల్లిలో గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. సర్పంచ్ ఇంటి ముందు నిరసనలకు దిగారు. సర్పంచ్ డబ్బులు ఇవ్వకుండా డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. దీంతో హుజూరాబాద్ ఉపఎన్నిక రసవత్తరంగా మారుతుంది. మరో రెండు రోజుల్లో ఎన్నిక ఉండనుండటంతో..వోటర్ల కొనుగోలుకు పార్టీలు తెరలేపాయి. అయితే తమకు డబ్బులు రాలేదని కొంతమంది రోడ్డెక్కుతున్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారంలో డబ్బుల కోసం స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డబ్బుల కోసం గొడవలు చేస్తే కేసులు పెడ్తామని పోలీసులు బెదిరిస్తున్నారని మహిళలు అన్నారు. మమ్మల్ని బెదిరించడం కాదు.. డబ్బులు పంపిణీ చేసే వాళ్లను ఎందుకు అడ్డుకోవడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. అసలు డబ్బులు ఎవరు పంచమన్నారని మహిళలు నిలదీశారు. దాంతో మహిళలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డబ్బులు ఇస్తే అందరికీ ఇవ్వాలని, కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోతే సర్పంచ్ ఇంటిని ముట్టడిస్తామన్నారు. మహిళల ధర్నాతో కొద్దిసేపు ట్రాఫీక్ జామ్ అయ్యింది. హుజురాబాద్ మండలం కాట్రపల్లి, రాంపూర్లోని గ్రామ సర్పంచ్ల ఇళ్ల ముందు గ్రామస్థులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు గ్రామస్థులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. పెద్దపాపయ్య పల్లిలో కొంతమందికే డబ్బులు ఇచ్చి.. మిగతా వారికి ఇవ్వడం లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
గ్రామంలోని 8 వందల కుటుంబాలకి డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. గ్రామ సర్పంచ్ వొచ్చి సమాధానం చెప్పేదాక ఆందోళన విరమించేలేదని మహిళలు హెచ్చరించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లోనూ స్థానిక మహిళలు ఆందోళనకి దిగారు. కొంతమందికే డబ్బులు ఇచ్చి..మిగతా వారికి ఇవ్వడం లేదంటూ తహసీల్దార్ ఆఫీసు ముందు నిరసన చేపట్టారు. అందరికి డబ్బులిచ్చే వరకు ఆందోళన విరమించమని భీష్మించుకొని కూర్చున్నారు. ఉప ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడటంతో టిఆర్ఎస్, బిజెపిల మధ్య డబ్బుల పంపకాలపై పరస్పర ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. ఇరు పార్టీలకు సంబంధించిన డబ్బుల పంపిణీ వీడియోలు సోషల్ వి•డియాలో వైరల్ అవుతున్నాయి. మొదట టిఆర్ఎస్ పార్టీ వోటుకు ఆరువేల రూపాయలు చొప్పున పంపిణీ చేసినట్టు వీడియోలు వైరల్ కాగా, తాజాగా బీజేపీ పది వేల రూపాయల నగదు పంపిణీ చేస్తున్నట్టు వీడియోలు వైరల్గా మారాయి. అయితే ఈ వీడియోలు ఫేక్ వీడియోలు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
వోటర్లను ప్రలోభపెడుతున్నారు..ఎన్నికను రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తాం : కాంగ్రెస్ పార్టీ
ఇదిలా ఉంటే తాజా రాజకీయ పరిణామాలతో హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హుజురాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రకు ఫిర్యాదు చేయనున్నట్టు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వెల్లడించారు. అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ వోటర్లను టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వోటర్లను ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వోటుకు ఆరు వేల నుండి పదివేల రూపాయల వరకు డబ్బులు ఇచ్చి వోటర్లను ప్రలోభ పెడుతూ, వోట్లను కొనుగోలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనుంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో వోటర్లకు బహుమతులను ఇవ్వడం, వోట్లు కొనుగోలు చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, మద్యం పంపిణీ చేయడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం వంటివి జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ లో మూడు గంటల్లో లక్షన్నర మంది వోటర్లకు 90 కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని నిరంజన్ అన్నారు. ఇంత ఘోరంగా, విచ్చలవిడిగా ఇంతకుముందు ఎప్పుడూ అక్రమాలు జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీధర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, వేణుగోపాల్ తదితరులు కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రకు ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. హుజురాబాద్పై ఆశలు వదులుకున్న కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకోవడం కోసం ఈ తరహా ప్రయత్నాలు చేస్తుందని చర్చ జరుగుతుంది.
అటు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ రెండు పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు పంచి హుజురాబాద్ నియోజకవర్గ వోటర్లను ప్రలోభ పెడుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికపై భవిష్యత్తులో ఏం చెప్పాలన్న దానిపై ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఉప ఎన్నిక కాగా రేపు జరిగే పోలింగ్కు హుజురాబాద్ రెడీ అవుతుంది.