- వరి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంపై• ఆగ్రహం
- మద్దతు, తెలిపిన కాంగ్రెస్, బిజెపి బీజేపీ కౌన్సిలర్లు
వరి ధాన్యం కొనుగోలు నిలిపివేయడంపై రైతులు మరోసారి రోడ్డెక్కారు. సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో వరి ధాన్యం కొనుగోళ్లు ఆపడంపై రైతులు రోడ్డు పైకి వొచ్చి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగికి సంబంధించిన పంట కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. రైతుల ఆందోళన తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బిజెపి కౌన్సిలర్ లలిత వారికి మద్దతు ప్రకటించి వారితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమయ్యిందని, క్షేత్ర స్థాయిలో అధికారులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక ఎంఎల్ఎ మరియు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేవలం మాటలకే పరిమితం అయిందని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎన్ఎస్యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్, యువజన కాంగ్రెస్ నాయకులు కావాలి సంతోష్, మోయిన్ అహ్మద్ ఇతర నాయకులు పాల్గొన్నారు.