- ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబిత
- వెబ్సైట్లో అందుబాటులో ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్లో ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చని మంత్రి తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది వార్షిక పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఫీజు చెల్లించిన 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించారు.
వీరిలో 2,10,647 మంది 10 జీపీఏ సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తం 535 పాఠశాలలు 10 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ-1) ఆధారంగా విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లను ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు.విద్యార్థులు తమ మెమోలను ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్ఎస్ఎస్సీ బోర్డుకు పంపితే వెంటనే సరిదిద్దుతామని తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.