- రైతులను తరలించేందుకు పోలీసుల యత్నం
- రైతులు ఖాళీ చేసి వెళ్లాలని స్థానికుల డిమాండ్
ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ వారిని తరలించేందుకు పోలీసులు యత్నించడంతో మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాము కదిలేది లేదని వారు భీష్మించుకున్నారు. దాదాపు 3 నెలలుగా దేశ రాజధాని శివార్లలో బైఠాయించారు. ఐతే రిపబ్లిక్ డే రోజు చెలరేగిన హింసాత్మక ఘటనల తర్వాత రైతు సంఘాల్లో చీలిక వచ్చింది. కొన్ని రైతు సంఘాలు ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించాయి. కానీ పలు సంఘాలు మాత్రం ఇంకా కొనసాగిస్తున్నాయి. ఇక గురువారం నుంచి ఢిల్లీ శివార్లలో నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. ఘాజీపూర్ సరిహద్దులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇప్పటికే యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రైతులు, భద్రత దళాల మధ్య వాగ్వాదం నెలకొంది.
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళనలను విరమించేది లేదని రైతులు అన్నారు. సింఘు సరిహద్దు వద్ద మరో గొడవ జరుగుతోంది. రైతులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. రైతులు, స్థానికుల పోటా పోటీగా నినాదాలు చేస్తున్నారు. రైతు సమస్యలను అర్థం చేసుకొని ఇన్నాళ్లు మద్దతు ఇచ్చామని..కానీ ప్రస్తుతం ఈ ఆందోళనలు వేరొకరికి చేతుల్లోకి వెళ్లిపోయానని ఆరోపిస్తున్నారు. వీరి వల్ల మాకు సమస్యలు వస్తున్నాయని విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే రైతులు వెళ్లిపోవాని నినాదాలు చేస్తూ.. గుడారాలను తొలగించే ప్రయత్నం చేశారు.స్థానికులు ఇచ్చిన ట్విస్ట్తో రైతులు షాక్ తిన్నారు. దీని వెనక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొనడంతో భద్రతా దళాలు కలగజేసుకొని.. టియర్ గ్యాస్ ప్రయోగించారు.