సూర్యాపేట, మే 9, ప్రజాతంత్ర ప్రతినిధి): ప్రపంచాన్ని వణికించిన కరోనా ఎఫెక్ట్తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 43రోజుల పాటు లాక్డౌన్ కొనసాగించిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక మాంద్యంలో పూడుకుపోయాయి. దానిలో భాగంగా కేంద్రం ఈనెల 3న కొన్ని అత్యవసర, నిత్యావసర, మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 6నుండి తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 43రోజుల నుండి మద్యం దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మద్యం దుకాణల తెరుచుకోవడంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తెల్లవారుజాము నుండే సామాజిక, భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్లు ధరించి మద్యం దుకాణాలు ముందు బారులు తీరి పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. మన ప్రక్క రాష్ట్రాలలో గుంపులు గుంపులుగా మద్యం దుకాణాల ముందు ఉన్న దృశ్యాలే కనపడ్డాయి. 43రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో పురుషుల తోపాటు మహిళలు కూడా క్యూలైన్లో నిలబడి మద్యాన్ని కొనుగోలు చేశారు. ప్రతి వైన్స్షాపు వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేశారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 3కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, రెండవ రోజు కూడా అదే తరహలో మూడు కోట్ల మార్క్ దాటింది. 3,4రోజుల్లో 2 కోట్లపైగా మద్యం అమ్మకాలు జరిగాయి.
ఈ నాలుగు రోజుల్లో 10కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. లిక్కర్ అమ్మకాల జోరు రోజు రోజు కొనసాగుతునే ఉంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకు అనుకొని అంతర్ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఉండటంతో అక్కడి రాష్ట్రం దశల వారీగా మద్యంపాన నిషేధాన్ని అమలుచేస్తుండగా లాక్డౌన్ సడలింపులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. అక్కడిప్రభుత్వం 75శాతం లిక్కర్పై పెండంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన మద్యం ప్రియులు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోకు ఎక్కువగా వస్తున్నారని విశ్వసనీయ సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీప్ లిక్కర్పై 11శాతం, బ్రాండెడ్ మద్యానికి 16శాతం పెంచడం జరిగింది. 4రోజుల్లో మద్యం కొనుగోలు 10కోట్లు దాటడానికి ఇది కూడా ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 75మద్యం దుకాణాలకు 74దుకాణాలు తెరిచివున్నాయి. లాక్డౌన్కు ముందు నెలకు 60కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగేవని ఎక్సైజ్ అధికారులు తెలుపుతున్నారు. 43రోజుల పాటు లాక్డౌన్ ఉండి సడలించిన తరువాత భారీగా మద్యం అమ్మకాలు ఉంటాయని అధికారులు, మద్యం దుకాణాల యజమానులు భావించారు. దానికి విరుద్దంగా లిక్కర్ అమ్మకాలు జరిగాయని పలువురు అంటున్నారు. దీనికి కారణం సూర్యాపేట జిల్లా రెడ్జోన్గా ఉండటం, లాక్డౌన్ పకడ్బందీగా అమలు జరగడంతో గ్రామాల నుండి ప్రజలు రాకపోవడమే కారణం కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎలాంటి పనులు జరగకపోవడం,రోజు వారి కూలీలు రాకపోవడం ఇది కూడా ఒక కారణం, లాక్డౌన్ సడలించిన తరువాత మద్యం అమ్మకాలు పెరిగే ఆస్కారం ఉందని పలువురు అంటున్నారు.