- ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తం స్పర్శ్ హాస్పిస్
- ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్
- శ్రీశ్రీ అన్నట్లు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదేనని వ్యాఖ్య
కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మ సంతృప్తి దొరుకుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆశయం మంచిదైనప్పుడు, ఆలోచన మంచిదైనప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగితీరుతాయని చెప్పారు. దానికి గొప్ప ఉదాహరణ స్పర్శ్ హాస్పిస్ అన్నారు. క్యాన్సర్ రోగుల కోసం హైదరాబాద్లోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పర్శ్ హాస్పిస్ నుంచి ఆహ్వానం వొచ్చే వరకు పాలియేటివ్ కేర్ అంటే ఏంటో తెలియదని చెప్పారు. పాలియేటివ్ కేర్ గురించి స్వయంగా తెలుసుకుంటే గొప్పగా అనిపించిందని తెలిపారు. ఐదేండ్లలోనే స్పర్శ్ హాస్పిస్కు మంచి భవనం రావడం సంతోషకరమని వెల్లడించారు. రోటరీ క్లబ్ చేసే ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని చెప్పారు. స్పర్శ్ హాస్పిస్కు నీటి బిల్లు, విద్యుత్ బిల్లు, ఆస్తిపన్ను రద్దుచేస్తామని హామి ఇచ్చారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదేనని పేర్కొన్నారు.
ప్రభుత్వమే అన్ని చేయాలంటే కుదరదని, ప్రైవేటు సంస్థలతో కూడా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. క్యాన్సర్ రోగుల కోసం ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ’స్పర్శ్ హాస్పిస్’ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది. ఇంతకాలం రోటరీ క్లబ్ బంజారాహిల్స్ సారథ్యంలో అక్కడి రోడ్ నం.12లోని అద్దెభవనంలో సేవలు అందించింది. ప్రస్తుతం దానిని ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన భవనానికి మార్చారు. దీనిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్లో వర్షం పడితే ట్రాఫిక్ జామ్కు తానొక్కడినే బాధ్యుడిని కాదన్నారు. ప్రపంచంలో అనేక రకాల సేవలు ఉంటాయని, మనిషికి అవసాన దశలో చేసే సేవే నిజమైన సేవ అని శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి అన్నారు.
మనిషికి చివరి దశలో ఆత్మీయ స్పర్శ, పలకరింపు కావాలన్నారు. చివరి మజిలీలో సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని నిర్మించారు. ఈ స్థలాన్ని 33 ఏండ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. మృత్యు ముంగిట్లో ఉన్న వేలాది మంది క్యాన్సర్ రోగులకు స్పర్శ్ హాస్పిస్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అధునాతన భవనంలో పూర్తి వసతులతో 82 పడకలు ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా 10 పడకలు ఏర్పాటు చేశారు. ఈ దవాఖానకు ఆంధప్రదేశ్తోపాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్దసంఖ్యలో రోగులు వొస్తున్నారు.