- చౌకబారు, హీన స్థాయి ప్రయోగాలకు కేంద్రంగా హుజూరాబాద్
- ఎన్నికల కమీషన్, చట్టం కేసిఆర్కు ఊడిగం చేస్తున్నాయి
- తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్
ముషీరాబాద్, ప్రజాతంత్ర విలేకఖరి, ఆగస్టు 23 : తెలంగాణలో ఆర్ధిక, పాలనా వ్యవస్థ రెండు అస్తవ్యస్తమయి అప్పులతో, అనారోగ్యంతో కునారిల్లుతుంటే కేసిఆర్ చౌకబారు, హీన స్థాయి ప్రయోగాలకు హుజూరాబాద్ కేంద్రమయ్యిందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని కేసిఆర్, స్వంత ఎజెండా అమలు చేయక ‘సన్నాసుల మఠమా’ మాది అని దళిత బంధు విషయంలో హుజూరాబాద్లో ఎదురు ప్రశ్నిస్తే వీళ్ళని తాలిబన్ తీరు ‘షరియత్’ అమలు చేస్తున్న వాళ్ళుగానే భావించవలసి ఉంటుందన్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధుల్ని డబ్బు, అధికారం, పథకాలను కాదని గెలిపించుకున్న ప్రజలు ఉప ఎన్నికలలొస్తే కనీవినీ ఎరుగని అధికార దుర్వినియోగం, డబ్బుల ప్రవాహం, ఏ చట్టం అంగీకరించని ఓటర్లను ప్రలోభపెట్టే పథకాలు సాధరణమయి పోతున్నాయన్నారు. ఈటెల రాజేందర్ మీద కసికొద్ది కేసిఆర్ విసురుతున్న ఈ ఈటెలు తెలంగాణలో ఎన్నికల్ని హాస్యాస్పదం చేస్తున్నాయన్నారు.
ఎన్నికల కమీషన్, చట్టం చేష్టలుడిగి కేసిఆర్కు ఊడిగం చేస్తున్నాయ న్నారు. డెంగ్యూ వ్యాధి, ఇతర జబ్బులు, కరోనా కొత్త వేరియంట్లతో అతలాకుతలం అవుతున్న ప్రజారోగ్య వ్యవస్థకు మంత్రిగా ఉండి, దవాఖానాల అభివృధ్ధి, ఆధునీకరణ, సౌకర్యాలపై మాట మాట్లాడకుండా మనం అక్కడ గెలువబోతున్నాం, ఇక్కడ వాసాలమర్రిలో ప్రభావం ఎట్లావుంది? యాదాద్రి, వేములవాడలో ఏమవుతుందంటూ భాధ్యతారహితంగా ఉండడం తాలిబన్ అరాచకం కాదా? అని ప్రశ్నించారు. కేసిఆర్, కేటిఆర్ హెల్త్ ప్రొఫైల్ తయారుచేస్తం, ‘ఎయిర్ అంబులెన్స్’ హెలిక్యాప్టర్లో రోగులను తరలిస్తామని చెపుతూ కనీస నిధులు అందక, రోగులకు సౌకర్యాలు అందించని రెఫరల్ హాస్పిటల్స్పై సమీక్ష కూడా జరుపరు అని, మా కుటుంబం కోసమే తెలంగాణ వచ్చింది, ఇది మా ఇష్టారాజ్యమని బాహాటంగా వ్యక్తీకరించే కేసిఆర్కు, షరియత్ పేర, ఇస్లామ్ పేర అరాచకం, హత్యాకాండ చేసే తాలిబన్కు ఏమి తేడా ఉందో కౌంటర్ ప్రకటనలు ఇచ్చే మంత్రులు జగదీష్రెడ్డి, వారి మందిమాగదులు తెలియజేయాలన్నారు.
కేసిఆర్ అసంబద్ద పాలనను ప్రజా ప్రయోజన కోణంలో ఎత్తి చూపి బోనులో నిలబెట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే బిజెపి, కేసిఆర్, మజ్లీస్, ఒవైసీ కుమ్మక్కు జరిగిందని తాలిబన్లతో అంటకాగుతున్న మజ్లీస్ కేసిఆర్ను ఓడించాలని అక్కరకు రాని ప్రకటనలు ఇస్తున్నారన్నారు. విధ్వంసకర శక్తుల ఉనికి తత్కాలికమే అని నిన్న నరేంద్ర మోడీ ప్రకటించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దుందుడుకు, విధ్వంసకర, రాజ్యంగ వ్యతిరేక కార్యాచరణ కొనసాగించవద్దని, తాలిబన్ పోలిక కూడా ఈ దేశ ప్రజాస్వామిక స్ఫూర్తికి పనికి రాదని ఆచరణాత్మకంగా చూపెట్టాలన్నారు. తాలిబన్ అరాచకాలకు భిన్నంగా మా పాలన సాగుతుందని ‘తాలియా’ కొట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యయుగాల ‘షరియత్’కు భిన్నంగా ఎంత వరకు ఉన్నాయో జవాబు చెప్పాలన్నారు.