Take a fresh look at your lifestyle.

ఇం‌టర్‌ ‌సెకండియర్‌ ‌ఫలితాలు విడుదల

  • వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వివరాలు
  • కొరోనా ఉధృతి దృష్ట్యా అన్‌లైన్‌లోనే తరగతులు
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

ఇం‌టర్మీడియట్‌ ‌సెకండియర్‌ ‌ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులకు వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులోకి వొచ్చాయి. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. మొత్తం ఉత్తీర్ణత సాధించిన వారిలో 1,76,719 మంది విద్యార్థులు ఏ గ్రేడ్‌, 1,04,888 ‌మంది విద్యార్థులు బీ గ్రేడ్‌, 61,887 ‌మంది సీ గ్రేడ్‌, 1,08,093 ‌మంది విద్యార్థులు డీ గ్రేడ్‌ ‌సాధించారు. కొరోనా మహమ్మారి దృష్ట్యా ఇంటర్‌ ‌సెకండియర్‌ ‌పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలను వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చన్నారు. విద్యార్థుల పాస్‌ ‌మెమోల్లో ఏమైనా తప్పులు దొర్లితే 040-24600110 నంబర్‌కు ఫోన్‌ ‌చేయొచ్చు.

ఈ నంబర్‌ ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇదిలావుంటే వైరస్‌ ఉధృతి తగ్గని నేపథ్యంలో, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేజీ టూ పీజీ వరకు ఆన్‌లైన్‌లోనే బోధన కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యా సంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమిక్షించారు. అనంతరం ఆమె మిడియాతో మాట్లాడారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆన్‌లైన్‌లోనే బోధన కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఆ మేరకు జులై 1వ తేదీ నుంచి కేజీ టూ పీజీ వరకు ఆన్‌లైన్‌లోనే బోధన కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

సెట్స్‌కు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పుల్లేవు. ఇంతకు ముందు ప్రకటించిన తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను కూడా జులై నెలలో నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలు రద్దు కావని మంత్రి సబిత స్పష్టం చేశారు. టీచర్ల హాజరుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టతనిచ్చారు. 50 శాతం మంది టీచర్లు మాత్రమే విధులకు హాజరు కావాలి. రోజు విడిచి రోజు టీచర్లు విధులకు హాజరు అవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన జీవో జారీ అవుతుందన్నారు. ప్రయివేటు పాఠశాలలు తప్పనిసరిగా 46 జీవోను అమలు చేయాలి. ట్యూషన్‌ ‌ఫీజును మాత్రమే తీసుకోవాలి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

Leave a Reply