- కారిడార్ ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం
- నిమ్జ్ భూముల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
- సంస్థల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి
- వెమ్ టెక్నాలజీకి మంత్రి కెటిఆర్ శంఖుస్థాపన
- పర్యావరణహితంగా పరిశ్రమలు ఉండాలని హితవు
- వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రమన్న కెటిఆర్
- గీతారెడ్డికి మంత్రి పదవి వొచ్చినా జహీరాబాద్కు ఒరిగిందేమీ లేదన్న మంత్రి
సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 22 : రక్షణరంగ సంస్థలకు తెలంగాణ హబ్ లాంటిదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిమ్జ్ భూముల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలివ్వాలని ఆయన కోరారు. భూమి కోల్పోయిన రైతులు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నారు. సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. జహీరాబాద్ నిమ్జ్లో తొలి పరిశ్రమ ‘వెమ్’ టెక్నాలజీ ప్రాజెక్టుకు ఐటీ మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, వెమ్ టెక్నాలజీ సీఎండీ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…1988లో వెమ్ టెక్ ప్రారంభించిన తరువాత రక్షణ రంగంలో అగ్రగామిగా మారిందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా మన దేశంలోనే రక్షణ రంగ పరికరాలు తయారీ..దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తాయన్నారు. మీరు కోరిన విధంగా భూములిచ్చాం.. స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించండని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న వెమ్ టెక్నాలజీ వారి నుద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు స్థానిక జహీరాబాద్ వారికి ఇవ్వాలి… జవాబుదారీగా ఉంటూ.. పర్యావరణ హితంగా నిర్వహించాలని అన్నారు. 12600 ఎకరాలు భూమి నిమ్జ్కు కేటాహిస్తే ఇప్పటికి 3500 ఎకరాలే సేకరించామన్నారు. భూమి కోల్పోయిన రైతులకు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని సూచించారు.
స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు 50 శాతం సహకారం అందిస్తామని సీఎండీ వెంకట్ రాజు చెప్పడం అభినందనీయమన్నారు. రక్షణరంగ సంస్థలకు తెలంగాణ హబ్ లా ఉంది..అయితే కేంద్రం ఈ విషయాలు పట్టించుకోకుండా బుందేల్ ఖండ్కు రక్షణ పరిశ్రమల తరలించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో రెండేళ్లలోపు అంటే 2024లోగా వెమ్ టెక్నాలజీని ప్రారంభం చేయాలని కోరుకుంటున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదే సందర్భంలో అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిఫెన్స్ కారిడార్ను బుందేల్ఖండ్కు తరలించారని విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. వెమ్ టెక్నాలజీస్ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి..ఉపాధి అవకాశాలు పెరగాలని చెప్పారు. సీఎస్ఆర్లో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ వొచ్చిన తర్వాత భూముల ధరలు బాగా పెరిగాయని చెప్పారు. కెటీఆర్ను భూ నిర్వాసితులైన రైతులు అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతులు గ్రామాల నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. నిమ్జ్ భూసేకరణకు వ్యతిరేకంగా పలు గ్రామాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రమన్న కెటిఆర్
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్టం అని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గతంలో పని చేసిన ప్రభుత్వాలు మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. 50 లక్షలు ఇస్తే గతంలో పాలించిన ప్రభుత్వాలు ఎంతో గొప్పగా చెప్పుకొనేవారన్నారు. వార్డుకు రెండు లక్షల చొప్పున వొచ్చేవి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ 50 కోట్లు మంజూరు చేశారని అన్నారు. అప్పటినుంచి జహీరాబాద్ రూపురేఖలు మారిపోయాయన్నారు. తాను చిన్నప్పుడు చూసిన జహీరాబాద్కు, ఇప్పటి జహీరాబాద్కి చాలా తేడా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రతి పట్టణం డెవలప్ అవుతుందన్నారు.
గీతారెడ్డికి మంత్రి పదవి వొచ్చినా జహీరాబాద్కు ఒరిగిందేమీ లేదన్న మంత్రి
గతంలో ఇక్కడ పనిచేసిన గీతారెడ్డికి మంత్రి పదవి వొచ్చింది కానీ, ఈ ప్రాంత ప్రజలకు ఏమీ రాలేదన్నారు. మన ఎమ్మెల్యే, మాణిక్ రావు, ఎంపీ బిబి పాటిల్ పని మంతులని వారు ఎల్లపుడు అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫరిదొద్దీన్ జహీరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ వొచ్చిన ప్రతి సారి జహీరాబాద్ కు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను అడిగేవారన్నారు. రాహుల్ గాంధీ మొన్న తెలంగాణకు వొచ్చి కాంగ్రెస్స్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడు. కాంగ్రెస్స్ కు 50 సార్లు అవకాశం ఇచ్చినా ఏం చేయలేదు.. ఇప్పుడు అవకాశం ఇస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. గతంలో ఉన్న పింఛన్లకు ఇప్పుడు పది రేట్లు పెరిగింది..బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పించన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర పూర్తి చేసి ఈ జిల్లాకు సాగు నీరు అందిస్తామన్నారు. గతంలో ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలంటే భయపడే వారు..కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు.
ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలకు 20 లక్షల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. 65 ఏళ్ళ నుండి పలు పార్టీలు చేసిన గబ్బును, దరిద్రాన్ని ఇప్పుడు ఇప్పుడే వదల గొడుతున్నామని తెలిపారు. సాగునీరు, తాగు నీరు, వైద్యం ఇలాంటి పనులు చేసుకుంటూ తాము పోతు ఉంటే.. కొంతమంది కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టె ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వాళ్ళను తరిమికొట్టాలన్నారు. దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర ముందుకు పోతుందన్నారు. ఎమ్మెల్యే మణిక్ రావు అడిగిన నిధులను వెంటనే మంజూరు చేస్తామని, వాటితో పట్టణ అభివృద్ధి చేసి ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎంపీ బిబి పాటిల్ జిల్లా మంత్రి హరీష్ రావుతో కలసి ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు ఎంపీ బిబి పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, తెరాస సీనియర్ నాయకులు తన్వీర్, విజయ్ కుమార్, గుండప్ప, మ్యాతరి ఆనంద్,ఇజ్రాయెల్ బాబీ, నామా రవికిరణ్, జహీరాబాద్ ఝరా సంగం న్యాలకల్ కోహిర్ మొగుడం పల్లి మండలాల అధ్యక్షులు ఎంజి రాములు, రాచయ్య స్వామి రవీందర్, నర్సిములు, శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మోహిఉద్దీన్, తెరాస నాయకులు ప్రజా పత్రినిధులు, తదితరులు పాల్గొన్నారు.