- కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు..
- మార్చ్ నుంచి ఇలాగే వ్యవహరిస్తున్నారు
- ప్రభుత్వ నివేదిక అస్పష్టంగా..నిర్లక్ష్యంగా ఉంది
- మళ్లీ సిఎస్ను కోర్టుకు పిలవాల్సి వస్తుంది
- ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీపై ఏం చర్యలు తీసుకున్నారు?
- రాష్ట్ర సర్కార్ తీరుపై మండిపడ్డ హైకోర్టు
- 22 వరకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
- చారణ 24కు వాయిదా
ప్రైవేట్ హాస్పిటళ్ల కొరోనా దోపిడీపై హైకోర్టు మారోమారు మండిపడింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వారికి బాధ్యత లేదా అంటూ నిలదీసింది. కొరోనా పేరుతో దండిగా వసూళ్లు చేస్తున్న ప్రైవేటు హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు హాస్పిటళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాయితీలు తీసుకున్న ప్రైవేటు హాస్పిటళ్లకు ప్రజలకు సేవ చేసే బాధ్యత లేదా? అని ప్రశ్నించింది. కోవిడ్ పరీక్షల నిర్వహణ,ప్రైవేట్ హాస్పిటళ్ల తీరుపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ తీరు పట్ల కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ హాస్పటల్ ఓవర్ చార్జీలపై ఈ నెల 22న నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఎన్ని ప్రైవేటు హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చారు..చర్యలపై నివేదిక సమర్పించాలని తెలిపింది. డిజాస్టార్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి..దానితో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కోర్టు ఆదేశించింది. పబ్లిక్ హెల్త్పై మార్చి 24 కు ముందు ఎంత ఖర్చు చేశారు. ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టారో నివేదిక ఇవ్వాలన్నది. అంతేకాక తెలంగాణ కోవిడ్ డెత్ రిపోర్టస్పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి రోజు 8 నుంచి 10 మంది మాత్రమే చనిపోతున్నారా.. అని ప్రశ్నించింది.
కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారని, మార్చి నుంచి ఇదే విధంగా వ్యవహారిస్తున్నారని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితమైన రిపోర్టులు సమర్పించాలని..తప్పుడు నివేదికలు ఇస్తే మళ్లీ సీఎస్ని కోర్టుకు పిలువాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నెల 22వరకు రిపోర్టులన్ని నివేదించాలని సూచించింది. హాస్పిటళ్లల్లో సిబ్బంది, మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన్న ధర్మాసనం తదుపరి విచారణ 24 కి వాయిదా వేసింది. అయితే రాష్ట్రంలో కొరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నివేదిక నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం కొరోనా మృతులపై వాస్తవాలు వెల్లడించలేదనిపిస్తోందని పేర్కొంది. ఆగస్టు 31 నుంచి ఈనెల 4 వరకు జిల్లా బులిటెన్లు సమర్పించాలని, గ్రేటర్లో ఐసోలేషన్, కోవిడ్ కేంద్రాల జాబితా ఇవ్వాలని కమిషనర్కు హైకోర్టు ఆదేశింది. జిల్లాల నుంచి కోవిడ్ బాధితులు హైదరాబాద్కు వచ్చేలా అంబులెన్సులను పెంచాలంది.
ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే ప్రభుత్వ ల్యాబ్లు పెంచాలని, వైద్యారోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు కూడా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హాస్పిటళ్లలో లైవ్ డాష్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించింది. వీధుల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా కొరోనా పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ హాస్పిటళ్లపై విచారణ జరపాలని జాతీయ ఫార్మా ధరల సంస్థకు హైకోర్టు ఆదేశించింది. ఈనెల 22లోగా విచారణ నివేదిక సమర్పించాలని ఎన్పీపీఏకు న్యాయస్థానం ఆదేశించింది. నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీహెచ్ డైరెక్టర్కు సూచించింది. ప్రైవేట్ హాస్పిటళ్లలో సగం పడకలు రిజర్వు చేస్తారా? లేదా? అన్నది తెలపాలంది. డియా కథనాలకు.. ప్రభుత్వ నివేదికలకు పొంతన లేదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాల వారీగా నివేదికలు తెప్పించాలని చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కొరోనా మృతులపై వాస్తవాలు వెల్లడించలేదనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆగస్టు 31 నుంచి ఈనెల 4 వరకు జిల్లా బులిటెన్లను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 22లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది.