- పౌర హక్కుల సంఘం పిల్పై హైకోర్టు ఆదేశం
- విచారణ జరుపాలని వరంగల్ మూడవ మెజిస్ట్రేట్కు ఆదేశం
సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ జరపాలని వరంగల్ మూడో మెజిస్ట్రేట్ను న్యాయస్థానం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది. రాజు మృతిపై పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. రాజును పోలీసులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ ఆరోపించారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఆడ్వ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు పక్రియ, పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ జరిగిందని హైకోర్టుకు ఏజీ నివేదిక ఇచ్చారు. వీడియోలను, పోస్ట్మార్టమ్ నివేదికను శనివారం రాత్రి 8 లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఏజిని ఆదేశించింది.
అయితే రాజు ఆత్మహత్యపై అతడి తల్లి, భార్య కూడా అనుమానం వ్యక్తం చేస్తూ..తన భర్తను పోలీసులే చంపారని, చంపి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజు భార్య మౌనిక ఆరోపించారు. రాజు దొరికాడని, అతణ్ని ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వొచ్చాయని పోలీసులు మాట్లాడుకోవడం తాము విన్నామని మౌనిక తెలిపింది. ‘‘ఒక్కగానొక్క కొడుకు ఇలా పోయాడు. వాణ్ని పోలీసులే చంపి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. నేను, నా కోడలు, మనుమరాలు అనాథలమయ్యాం. ఆదివారమే దొరికాడన్నారు. మళ్లీ దొరకలేదన్నారు. బుధవారం రాత్రి మమ్మల్ని పంపించేటప్పుడు..కోడలిని, మనుమరాలిని మంచిగా చూసుకోమని చెప్పారు. అప్పుడే మాకు అనుమానం కలిగింది’’ అని రాజు తల్లి ఈరమ్మ వాపోయారు.